వీటి మార్కెట్ విలువ రూ.100 కోట్ల పైనే
ఏసీబీ దాడుల్లో బట్టబయలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడి దాదాపు రూ.100 కోట్లకు పైనే ఆస్తులను సంపాదించినట్టు ఏసీబీ బుధవారం జరిపిన దాడుల్లో వెల్లడైంది. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న వెంకట్రెడ్డి అక్రమాస్తుల గురించి సమాచారం అందగానే ఏసీబీ అధికారులు ఆయన ఆస్తులపై మెరుపుదాడులు నిర్వహించారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారుసిన్హా తెలిపిన వివరాల ప్రకారం… వెంకట్రెడ్డికి చెందిన హనుమకొండలోని ఇంటితో పాటు మరికొన్ని జిల్లాల్లోని ఏడు ప్రాంతాల్లో ఉన్న ఆస్తులపై ఏసీబీ బృందాలు దాడులను నిర్వహించాయి. ఈ దాడుల్లో హనుమకొండ, నల్లగొండ, హైదరాబాద్తో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు నిందితుడి ఆస్తులను కనుగొన్నారు.
అవి ఒక సువిశాలమైన విల్లా, మరో భవనం కలిపి రూ.4.30 కోట్ల విలువైనవిగా గుర్తించారు. మరో కమర్షియల్ షాపింగ్ మాల్, 14 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు ఫ్లాట్లతో పాటు బ్యాంకులో రూ.40 లక్షల నగదును అధికారులు కనుగొన్నారు. ఇంట్లో రూ.30 లక్షలకు పైగా నగదుతో పాటు రూ.4 లక్షలకు పైగా విలువైన బంగారు నగలు, మూడు ఫోర్ వీలర్స్తో పాటు విలువైన గృహౌపకరణ వస్తువులు సోదాల్లో బయటపడ్డాయి. ఈ మొత్తం అక్రమాస్తుల విలువ రూ.7.69 కోట్లు కాగా, వీటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితుడు వెంకట్రెడ్డికి సంబంధించి మరికొన్ని ఆస్తులు కూడా ఉన్నట్టు సమాచారం ఉండటంతో వాటి గురించి కూడా ఆరా తీస్తున్నారు.



