నవతెలంగాణ-హైదరాబాద్: డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్ల్యాండ్ని అమెరికా స్వాధీనం చేసుకోవడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు వ్యతిరేకించాయి. దీంతో జనవరి 17న గ్రీన్ల్యాండ్ స్వాధీనానికి మద్దతు ఇవ్వని ఎనిమిది దేశాలు డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, బ్రిటన్ల దిగుమతులపై 10 శాతం సుంకాల్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ సుంకాలు ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయని, బహుశా జూన్ 1 నాటికి ఈ సుంకాలు 25 శాతం మేర పెరుగుతాయని కూడా ఆయన బెదిరించారు. తాజాగా గురువారం గ్రీన్ల్యాండ్ స్వాధీనానికి మద్దతివ్వడం వల్ల ఈ దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న పన్నుల్ని విధించడాన్ని ట్రంప్ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్పోస్ట్లో ట్రంప్ పేర్కొన్నారు.
కాగా, తాజాగా నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ట్రంప్ యూరోపియన్ యూనియన్ దేశాలపై పన్నులు వేయడాన్ని ఉపసంహరించుకున్నారు. ‘ఈ చర్య అమెరికాకు, నాటో మిత్ర దేశాలు రెంటికీ ప్రయోజనకరంగా ఉంది’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్లో అభివర్ణించారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో నేను జరిపిన చాలా ఉత్పాదక సమావేశం ఆధారంగా.. గ్రీన్ల్యాండ్, ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించి భవిష్యత్ ఒప్పందం యొక్క ఫ్రేమ్ వర్క్ని మేము రూపొందించాము. దీనివల్ల అమెరికాకు, నాటో మిత్ర దేశాలకు గొప్ప పరిష్కారం లభించింది. ఈ అవగాహన ద్వారా యూరోపియన్ యూనియన్ దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన సుంకాను నేను విధించను’ అని ట్రంప్ పోస్టులో పేర్కొన్నారు.
అలాగే గ్రీన్ల్యాండ్ (బంగారు గోపురం) కు సంబంధించిన విషయంపై చర్చలు జరుగుతున్నాయి. చర్చలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి. అవసరమైతే ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్లు చర్చలకు బాధ్యత వహిస్తారు. వీటికి సంబంధించిన నివేదికల్ని వారు నాకు అందిస్తారు అని ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్టులో ప్రస్తావించారు.



