నవతెలంగాణ – హైదరాబాద్:
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ)
గ్రేటర్ హైదరాబాద్ నగర కమిటీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర కారును తాడుతో లాగుతూ నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ హైదరాబాద్ నగర కార్యదర్శి ఎండీ. జావీద్ మాట్లాడుతూ.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ నిల్వలు దేశంలో అపారంగా ఉన్నాయని ధరలు పెంచమని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలియజేసిందని కానీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన అనంతరం పెట్రోల్ పైన రూ.3, డీజిల్ పైన రూ.3 ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందని విమర్శించారు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యవసర సరుకులు ధరలు పెరుగుతున్నాయని అన్నారు.
బిజెపి ప్రభుత్వ విధానాలు దేశాన్ని సంక్షోభం వైపు తీసుకెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల వలన దేశ ప్రజల పైన నెలకు సుమారు రూ.3600 కోట్లు, సంవత్సరానికి రూ.43 వేల కోట్ల అదనపు భారం పడుతున్నదని అన్నారు. ఇవి కాకుండా పరోక్షంగా మరొక రూ.30 వేల కోట్ల భారం పడనుందని అందోళన వ్యక్తం చేశారు, డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యవసర సరుకులు బియ్యం, ఉప్పు, పప్పు, నూనెలు, కూరగాయలు వంటి ధరలు ఆకాశాన్ని అంటుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్,రాజు, జిల్లా నాయకులు సునీల్ పవర్, వీరేందర్,మనోజ్, సైదులు తదితరులు పాల్గొన్నారు.



