నవతెలంగాణ-తాడూర్
కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి తాడూర్ మండలం కేంద్రంలో బస్టాండ్ సమీపంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అంతటి కాశన్న మాట్లాడుతూ.. సుందరయ్య మచ్చలేని మహా నాయకుడని, ఆయన జీవితమంతా పేదప్రజల కోసం అంకితం చేశారని కొనియాడారు. ఆయన రైతులు, కూలీలు, పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని అన్నారు. ముఖ్యంగా తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన పాత్ర చాలా గొప్పదని తెలిపారు. ప్రధాన పోరాటాలు తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం 1946–1951 మధ్య హైదరాబాద్ నిజాం పాలనలో దోపిడీ, వెట్టిచాకిరి, జమీందారుల అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణా రైతాంగ పోరాటానికి సుందరయ్య నాయకత్వం వహించారు.
రైతులకు భూమి ఇవ్వాలని, వెట్టిచాకిరి రద్దు చేయాలని, దొరల దౌర్జన్యాలకు ముగింపు పలకాలనే డిమాండ్లతో ఉద్యమం నడిపారని గర్తు చేశారు. భూ సంస్కరణల కోసం, భూమిలేని పేదలకు భూమి ఇవ్వాలని సుందరయ్య గట్టిగా పోరాడారని చెప్పారు. “దున్నేవాడికే భూమి” అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని అన్నారు. కార్మికుల హక్కుల కోసం, కూలీలకు కనీస వేతనాలు, పని గంటల నియంత్రణ, కార్మిక హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేశారు. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా, జాతి వివక్ష, అణచివేత, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిని మహానుభావుడని వర్ణించారు. పేద ప్రజల అభ్యున్నతే ఆయన లక్ష్యంగా తన జీవితాన్ని ధారపోశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి ఏనుపోతుల కాశన్న, శంకర్, శ్యాంసుందర్, వెంకటస్వామి, రాములు, చంద్రయ్య, మన్యం తదితరులు పాల్గొన్నారు.



