24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడేప్పాడ్ గ్రామంలోని శ్రీ రామాలయంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర ప్రాపర్టీ నేరస్తులను మంగళవారం ఉదయం అరెస్ట్ చేసి, చోరీకి గురైన 1080 గ్రాముల వెండి వస్తువులను వంద శాతం రికవరీ చేసినట్లు పరకాల ఏసీపీ సతీష్ బాబు వెల్లడించారు.
అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి..
గుడిపాడు NH-163 పక్కన ఉన్న రామాలయంలో సోమవారం రాత్రి 8 గంటల తర్వాత నుంచి మంగళవారం తెల్లవారుజాము 3 గంటల మధ్య దుండగులు చొరబడ్డారు. ఆలయ ఛైర్మన్ కందికొండ రఘుపతి మంగళవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు లైట్లు వేసి గుడికి తాళం వేస్తామని, సోమవారం రాత్రి కూడా పూజారితో కలిసి తాళం వేసి వెళ్లినట్లు పేర్కొన్నారు. మంగళవారం తెల్లవారుజాము 3 గంటలకు గ్రామ వాటర్మెన్ గుడి లైట్లు ఆరిపోయి ఉండటం గమనించి అనుమానంతో లోపలికి వెళ్లగా గర్భగుడి తాళం పగులగొట్టి ఉంది. వెంటనే ఛైర్మన్కు, పూజారికి సమాచారం ఇచ్చారు.
రూ.2.43 లక్షల వెండి మాయం
తనిఖీల్లో విలువైన వెండి వస్తువులు శఠగోపాలు 2, ప్లేట్లు-2, రెండు స్పూన్, గదా, చోరీకి గురైనట్లు తేలింది. దాని విలువ సుమారు రూ.2,43,000 ఉంటుంది. ఫిర్యాదు అందుకున్న వెంటనే ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వాహన తనిఖీల్లో చిక్కిన దొంగలు
మంగళవారం ఉదయం 7.30 గంటలకు ఆత్మకూరు శ్రీ రామదుర్గ ట్రాక్టర్ కన్సల్టెన్సీ వెనుక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు జే.శ్రీనివాస్ ప్రసాద్ డి.తిరుపతి, కాటకం శ్రీను వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా AP39 NK 1885 నంబర్ కారు అనుమానాస్పదంగా కనిపించింది. ఆపి ప్రశ్నించగా నిందితులు నేరం అంగీకరించారు.
నిందితులు వివరాలు..
A1: కల్లాకూరి కిరణ్బాబు (40), వడ్రంగి, భీమవరం, ఏపీ. ఇతను అంతర్రాష్ట్ర హిస్టరీ షీటర్. ఏపీలో 39, తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 11 కేసులతో కలిపి మొత్తం 50 ప్రాపర్టీ కేసుల్లో నిందితుడు. మిర్యాలగూడ 1టౌన్, 2టౌన్, తిరుమలాయపాలెం, కేసముద్రం, నిడమానూర్, కురవి, కామేపల్లి, గార్ల, మధిర టౌన్ పీఎస్లలో 2022లో నమోదైన 11 కేసులున్నాయి.
A 2) కడవకల్లు సందీప్కుమార్ (35), యాడికి, అనంతపురం జిల్లా, ఏపీ. నిందితులు సోమవారం రాత్రి చోరీ చేసి వెండి వస్తువులను కారులో దాచినట్లు విచారణలో వెల్లడించారు. పోలీసులు చోరీ సొత్తు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎసిపి తెలిపారు.
సీపీ ప్రశంస..
24 గంటల్లోనే కేసును ఛేదించి వంద శాతం చోరీ సొత్తు రికవరీ చేసిన ఆత్మకూరు సిబ్బంది జే. శ్రీనివాస ప్రసాద్ ,డి.తిరుపతి, శ్రీనులను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు. దేవాలయంలో చోరీ జరిగిన ఘటనతో ఆందోళన చెందిన భక్తులు, గ్రామస్థులు పోలీసుల చర్యలపై హర్షం వ్యక్తం చేశారు.



