నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులు తినడం లాంటి చిన్న ఆహారపు అలవాటు.. ప్రీ-డయాబెటిస్ తో బాధపడుతున్న మధ్య వయస్కులైన భారతీయుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని, జీవక్రియల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ‘జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్’లో ప్రచురితమైన తాజా పరిశోధన వెల్లడించింది. అలాగే శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడి సూచికలను కూడా బాదం తగ్గిస్తుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మందికి పైగా ప్రీ-డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇది భవిష్యత్తులో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచడమే కాకుండా, మెదడు పనితీరును సైతం దెబ్బతీస్తుంది.
న్యూఢిల్లీలో 24 వారాల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో భాగంగా.. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉండి, ప్రీ-డయాబెటిస్తో బాధపడుతూ మెదడు పనితీరు క్షీణతకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేని 60 మంది భారతీయులను ఎంపిక చేశారు. భారతీయ ఆసియన్లకు సూచించిన విధంగా సమతుల్య ఆహారం తీసుకునేలా వీరికి మార్గనిర్దేశం చేసి, వారిని రెండు బృందాలుగా – కంట్రోల్ గ్రూప్ మరియు ఇంటర్వెన్షన్ గ్రూప్ విభజించారు. కంట్రోల్ గ్రూప్ వారు సాధారణ ఆహారాన్ని కొనసాగించగా, ఇంటర్వెన్షన్ గ్రూప్ వారు తీసుకునే ఆహారంలో బాదంను చేర్చారు. వారు తీసుకునే రోజువారీ కేలరీల్లో 20 శాతం (సుమారు రోజుకు 32-42 గ్రాములు) బాదం ఉండేలా చూసుకున్నారు. పరిశోధకులు వారానికి రెండుసార్లు వర్చువల్గా, ప్రతి నాలుగు వారాలకు ఒకసారి ప్రత్యక్షంగా వారిని పర్యవేక్షించారు. అధ్యయనం ప్రారంభంలో మరియు ముగింపులో వారి ఆలోచనా సామర్థ్యం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, హెచ్బీఏ1సీ, రక్తంలోని కొవ్వులు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్, నడుము చుట్టుకొలత తదితర అంశాలను పరిశోధకులు అంచనా వేశారు.
అధ్యయనం ముగిసే సమయానికి, బాదం తీసుకున్న బృందంలోని సభ్యుల్లో కార్యనిర్వాహక పనితీరు, నిర్ణయాలు తీసుకునే వేగం మెరుగుపడినట్లు గుర్తించారు. ఇవి మెదడు పనితీరుకు కీలక సూచికలు. అలాగే, వారి రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ సైతం మెరుగైంది. పరగడుపున రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడం, భోజనం చేసిన రెండు గంటల తర్వాత కూడా గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉండటం, దీర్ఘకాలిక బ్లడ్ షుగర్ కంట్రోల్కు సూచిక అయిన హెచ్బీఏ1సీ మెరుగుపడటం వంటివి గమనించారు. అదనపు జీవక్రియ ప్రయోజనాల్లో భాగంగా.. శరీర బరువు, కొవ్వు, బీఎంఐ, నడుము చుట్టుకొలత, మొత్తం కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) గణనీయంగా తగ్గాయి. బాదం పప్పులు తిన్న వారిలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడికి సంబంధించిన సూచికలు కూడా సానుకూలంగా మెరుగుపడ్డాయి.
ప్రీ-డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ఉన్న భారతీయులలో రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ, శరీర నిర్మాణాన్ని మెరుగుపరచడంలో బాదం పప్పులు సహాయపడతాయని ఇదే పరిశోధకులు గతంలో చేసిన అధ్యయనాలు కనుగొన్నాయి. అయితే, జీవక్రియ సంబంధిత వ్యాధులు మరియు ఆలోచనా శక్తి క్షీణించే ముప్పు ఎక్కువగా ఉండే మధ్య వయస్కులైన ప్రీ-డయాబెటిక్ బాధితుల్లో.. మెదడు పనితీరుపై బాదం చూపించే ప్రభావాన్ని విశ్లేషించిన తొలి అధ్యయనం ఇదే కావడం గమనార్హం.
న్యూఢిల్లీలోని ఫోర్టిస్-సీడీఓసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డయాబెటిస్, మెటబాలిక్ డిసీజెస్ అండ్ ఎండోక్రినాలజీ చైర్మన్, ఈ అధ్యయన సహ-పరిశోధకుడు డాక్టర్ అనూప్ మిశ్రా ఫలితాలపై స్పందిస్తూ.. “ఈ అధ్యయన ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ప్రజల మెదడు ఆరోగ్యానికి తోడ్పడే అవకాశం ఉంది. ప్రీ-డయాబెటిస్ ఉన్న వయోజనుల్లో ఆలోచనా శక్తి క్షీణించే ప్రమాదం ఉంటుంది. అయితే, రోజువారీ ఆహారంలో కొద్దిపాటి బాదం పప్పులను చేర్చుకోవడం అనే ఒక చిన్న మార్పు ద్వారా మెదడు ఆరోగ్యానికి మద్దతు లభిస్తుందని, ఆలోచనా సామర్థ్యం మెరుగుపడుతుందని మా అధ్యయనం సూచిస్తోంది” అని వివరించారు.
బాదంతో ఇంకా ఎన్నో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. “మా మునుపటి పరిశోధనల మాదిరిగానే, బాదంతో కూడిన ఆహారం బ్లడ్ షుగర్ కంట్రోల్, శరీర బరువు నియంత్రణ వంటి జీవక్రియ ఆరోగ్య సూచికలకు మేలు చేస్తుందని మేము కనుగొన్నాము” అని డాక్టర్ మిశ్రా ధృవీకరించారు. “ఈ మార్పులన్నీ కలిసి.. ప్రీ-డయాబెటిస్ అనేది టైప్ 2 మధుమేహంగా మారే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా భవిష్యత్తులో మతిమరుపు వ్యాధి ముప్పును కూడా నివారించవచ్చు.”
ఈ ఫలితాలను చర్చిస్తూ ప్రముఖ పోషకాహార నిపుణురాలు రితికా సమద్దార్ మాట్లాడుతూ.. “పెరుగుతున్న ప్రీ-డయాబెటిస్ సమస్య, జీవనశైలి ఆధారిత ఆరోగ్య ఆందోళనల నేపథ్యంలో, బాదం లాంటి ఆహారాన్ని తీసుకోవడం జీవక్రియ, మెదడు ఆరోగ్యానికి ఎలా మద్దతు ఇస్తుందో ఈ పరిశోధన ద్వారా వెల్లడి కావడం ఎంతో ప్రోత్సాహకరం. ఆలోచనా సామర్థ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, శరీర బరువు, కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడటం వంటి ఫలితాలు బాదంను ఒక ‘సూపర్ఫుడ్’గా పునరుద్ఘాటిస్తున్నాయి. వీటిని సులభంగా రోజువారీ ఆహారపు అలవాట్లలో చేర్చుకోవచ్చు. అంతేకాకుండా, సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడే ముఖ్యమైన పోషకాలను ఇవి అందిస్తాయి” అని పేర్కొన్నారు.
ఈ ఫలితాల వెనుక ఉన్న కారణాలను న్యూఢిల్లీలోని నేషనల్ డయాబెటిస్, ఒబేసిటీ అండ్ కొలెస్ట్రాల్ ఫౌండేషన్కు చెందిన న్యూట్రిషన్ రీసెర్చ్ గ్రూప్ అధిపతి, ఈ అధ్యయన ప్రధాన పరిశోధకురాలు డాక్టర్ సీమా గులాటి వివరిస్తూ.. “శరీరంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడి పెరగడం వల్లే మెదడు పనితీరు క్షీణిస్తుంది. కంట్రోల్ గ్రూప్తో పోలిస్తే, బాదం తీసుకున్న వారిలో ఈ రెండూ తక్కువగా ఉన్నాయని, అలాగే రక్షణ కల్పించే యాంటీ ఆక్సిడెంట్ (విటమిన్ ఇ) స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని మా అధ్యయనం కనుగొంది” అని తెలిపారు.
“ఈ పరిశోధనాంశాలన్నింటినీ క్రోడీకరిస్తే.. బాదం పప్పులలోని పోషకాలు, జీవక్రియల ఆరోగ్యంపై వాటి సానుకూల ప్రభావాలు, వాపు మరియు ఆక్సీకరణ ఒత్తిడి సూచికలను తగ్గించడంలో వాటి పాత్ర తదితర యంత్రాంగాల ద్వారా ప్రీ-డయాబెటిస్ బాధితులలో మెదడు ఆరోగ్యాన్ని బాదం మెరుగుపరుస్తుందని, ఆలోచనా శక్తి క్షీణతను తగ్గిస్తుందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి” అని డాక్టర్ మిశ్రా ధృవీకరించారు.
ఒక ఔన్స్ (28 గ్రాముల) బాదంలో 6 గ్రాముల ప్రోటీన్, 4 గ్రాముల పీచు పదార్థం, 13 గ్రాముల అసంతృప్త కొవ్వు, కేవలం 1 గ్రాము సంతృప్త కొవ్వు ఉంటాయి. అలాగే మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఇ సహా 24 ముఖ్యమైన పోషకాలు అందుతాయి. బాదంను నేరుగా తినొచ్చు లేదా తృణధాన్యాలు, పెరుగు, కూరలు, సలాడ్లలో కలుపుకుని ఆస్వాదించవచ్చు.



