నవతెలంగాణ-హైదరాబాద్ : సోషల్ మీడియా ద్వారా అనూహ్యంగా గుర్తింపు తెచ్చుకుని, “ఆ కుర్చీని మడత పెట్టి…” అనే ఒక్క డైలాగ్తో లక్షలాది మంది ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న కుర్చీ తాత అలియాస్ మహ్మద్ పాషా కన్నుమూశారు. ఆయన మృతి వార్త సోషల్ మీడియా అభిమానులు, నెటిజన్లను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. మొన్నటి వరకు కృష్ణకాంత్ పార్క్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ అభిమానులతో ముచ్చటించిన పాషా ఇక లేరనే విషయం తెలిసి పలువురు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా కరీమాబాద్కు చెందిన మహ్మద్ పాషా ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సాధారణ జీవితం గడుపుతున్న పాషా, సోషల్ మీడియా ద్వారా ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయారు. ముఖ్యంగా హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద తరచూ తిరుగుతూ, అక్కడకు వచ్చే యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. ఇలా ఒకసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన “ఆ కుర్చీని మడత పెట్టి…” అనే డైలాగ్ అనూహ్యంగా వైరల్ అయింది. ఆ ఒక్క మాటతో పాషా పేరు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. మీమ్స్, రీల్స్, షార్ట్ వీడియోల్లో ఆయన డైలాగ్ విపరీతంగా వినిపించింది. అప్పటి నుంచి మహ్మద్ పాషా కంటే “కుర్చీ తాత” అనే పేరే ఎక్కువగా ప్రజల్లో గుర్తింపు పొందింది.
అయితే గతంలో కూడా కుర్చీ తాత మరణించారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఆ వార్తలను ఖండించారు. అనంతరం పాషా స్వయంగా మీడియా ముందు కనిపించి తాను ఆరోగ్యంగా ఉన్నానని, అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు. దీంతో ఆ పుకార్లకు తెరపడింది. కానీ ఈసారి విషాదకర ఘటన నిజమైంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్కులో వాకింగ్ చేస్తున్న సమయంలో తీవ్ర ఎండ ప్రభావంతో పాషా ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు సమాచారం. పార్కులో ఉన్న కొందరు వెంటనే గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు పాషాను ఇంటికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు.
అయితే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. చివరికి భార్య ఒడిలో తలపెట్టి ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.



