నవతెలంగాణ – అశ్వారావుపేట : వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట అసోసియేట్ డీన్ డా. జె. హేమంత కుమార్ ఆధ్వర్యంలో గురువారం అల్లిగూడెం గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు డా. ఐ.వి. శ్రీనివాస్ రెడ్డి, డి. స్రవంతి నిర్వహించారు. ఈ సందర్భంగా డా. ఐ.వి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పంట మార్పిడి విధానాన్ని అమలు చేయడం ద్వారా చీడపీడలు, కలుపు మొక్కల సమస్యలను నియంత్రించవచ్చని తెలిపారు. అలాగే ఆయిల్ పామ్తో పాటు ఇతర ఉద్యాన పంటల్లో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ప్రాధాన్యాన్ని వివరించారు.
మల్చింగ్ పద్ధతిని అనుసరించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించి, సాగులో నీటిని ఆదా చేసుకోవచ్చని సూచించారు. డి. స్రవంతి మాట్లాడుతూ యూరియా వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను ఉపయోగించాలని రైతులకు సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, నేల సారవంతంగా మారడంతో పాటు ఎక్కువ నీరు, పోషకాలను మొక్కలు గ్రహించేందుకు దోహదపడుతుందని వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన ఆరు అంశాలపై కూడా శాస్త్రవేత్తలు రైతులకు క్లుప్తంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంజ శ్రీను,ఉప సర్పంచ్ కేరం మంగ, కార్యదర్శి స్వతంత్ర తేజ, వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్, విద్యార్థులు, రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



