ప్రతీ నెలా రూ.50 కోట్లు ప్రత్యేక నిధులు
ఇక నుంచి బ్యాంక్ ఖాతాల్లోనే పింఛన్లు జమ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతీ నెలా మొదటి తారీఖునే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై మంత్రి సీతక్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఐఏఎస్ అధికారులకు నెల నెలా సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా జీతాలు అందాలన్నారు. సిబ్బంది జీతాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలా చూడాలన్నారు. స్వంత ఆదాయంపై గ్రామపంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తొలగించిన నిబంధనను పునరుద్ధరించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 70(3) ప్రతిపాదిత సవరణ ప్రకారం గ్రామ పంచాయతీ స్వంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా సవరణ చేయాలని ఆదేశించారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ఆసరా పింఛన్ల ప్రస్తుత విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమచేయాలని సీఎం ఆదేశించారు. అర్హులకే పింఛన్లు అందేలా ఓటర్ ఐడీ, ఆధార్, సీపెక్ డేటా ఆధారంగా స్ట్రీమ్ లైన్ చేయాలని సూచించారు. కొత్తగా అందించే పింఛన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమీక్షలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, పంచాయతీరాజ్ ప్రతేక కార్యదర్శి దానకిషోర్, కమిషనర్ డి.దివ్య దేవరాజన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.



