కిలో సీఎన్జీపై
రూ.2 పెంపు
ఆటో, క్యాబ్, ట్రాన్స్పోర్ట్ రంగాలపై అదనపు భారం
నాలుగోసారి
సీఎన్జీ ధరల బాదుడు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మోడీ ప్రభుత్వం మళ్లీ షాకిచ్చింది. సీఎన్జీ ధరలను నాలుగోసారి పెంచింది. మొదటి సారి మే 15న కిలో సీఎన్జీపై రూ. 2 పెంచింది. మళ్లీ మే 17న రూ. 1, మే 23న రూ. 1 పెంచింది. తాజాగా మరో రూ. 2 పెంచడంతో 11 రోజుల్లో కిలో సీఎన్జీపై రూ. 6 పెరిగింది. ఈ పెరిగిన ధర మంగళవారం నుంచే అమలులోకి వచ్చింది. ఈ పెంపుతో వాహనదారులు, ఆటో, క్యాబ్, ట్రాన్స్పోర్ట్ రంగాలపై అదనపు భారం పడనుంది. ఢిల్లీలో సీఎన్జీ ధర రూ.81.09 నుంచి తాజాగా రూ.83.09కి చేరింది. ఇక ఉత్తర భారతంలోని ప్రధాన నగరాలైన నోయిడాలో రూ. 91.70 ఉండగా, ఘజియాబాద్ లో రూ. 91.70, గ్రేటర్ నోయిడాలో రూ. 91.70, గురుగ్రామ్ లో రూ. 88.12, అజ్మీర్ లో రూ. 92.44గా ఉంది. ఎన్నికల ముందు ఇంధన ధరలు పెంచబోమని పదేపదే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికలు ముగిశాక వరుసగా ధరలు పెంచుకుంటూ పోతోంది. సోమవారం పెరిగినన ఇంధన ధరలను మరువకముందే మోడీ ప్రభుత్వం తాజాగా మరోసారి ఇంధన ధరలను పెంచింది.
అంతర్జాతీయ చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో ఇంధన ధరలు పెరుగుతుండడం గమనార్హం. బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర గత శుక్రవారం 106 డాలర్లు ఉండగా మంగళవారం ఉదయం 97.70 డాలర్లకు తగ్గింది. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణల ప్రారంభానికి ఒక రోజు ముందు… అంటే ఫిబ్రవరి 27న బ్రెంట్ ధర కేవలం 78 డాలర్లే. భారత్ తన ముడి చమురు అవసరాలలో 88 శాతం, సహజ వాయువు అవసరాలలో 50 శాతం దిగుమతి చేసుకుంటోంది. ఇది ఎక్కువగా హార్ముజ్ జలసంధి మీదుగానే సరఫరా అవుతోంది. అయితే పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా సరఫరాలకు ఆటంకం ఏర్పడుతోంది.
నాలుగోసారి సీఎన్జీ ధరల బాదుడు
- Advertisement -
- Advertisement -



