– బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటున్న గ్రామస్తులు
నవతెలంగాణ – మిరుదొడ్డి
ఐదు రోజుల క్రితం భానుడి భగభగలకు తోడు వడగాల్పుల తీవ్రతతో ఓ రైతు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందెకి చెందిన బయ్యారం కిష్టారెడ్డి (60) అనే రైతు తనకున్న రెండు ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు. ఇటీవల దిగుబడిని స్థానిక కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. ఈ క్రమంలో ఎండ తీవ్రతను తట్టుకోలేక ఒక్కసారిగా ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను ఐదు రోజుల క్రితం వెంటనే సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కిష్టారెడ్డి కన్నుమూశారు.
ఇంటిని నడిపించే యజమాని అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న గ్రామ సర్పంచి కడారి యాదగిరి, రైతు రక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు అందె ప్రవీణ్ లు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కిష్టారెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


