నవతెలంగాణ-హైదరాబాద్: యూపీలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. హమీర్పూర్ జిల్లాలో బెత్వా నదిపై కొత్తగా నిర్మిస్తున్న వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. అర్ధరాత్రి వాళ్లందరూ నిద్రలో ఉండగా ఒక్కసారిగా భారీగా వచ్చిన ఈదురుగాలులతో రూ.కోట్ల విలువైన ఆ వంతెన ఊగిపోయింది. ఆ వెంటనే గడ్డర్లు, ఐరన్ సామాగ్రి నేలకూలాయి. దీంతో కార్మికులు నిద్రలోనే వాటి కింద సమాధి అయిపోయారు. పలువురికి గాయాలైయ్యాయి. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా యంత్రాంగం, మరియు విపత్తు నిర్వహణ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. చీకటిగా ఉండటం, వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు మొదట్లో తీవ్ర ఆటంకం కలిగింది. అయినప్పటికీ, అధికారులు రాత్రంతా శ్రమించి జేసీబీలు, గ్యాస్ కట్టర్ల సహాయంతో శిథిలాలను తొలగించే ప్రయత్నం చేశారు.



