నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీకి సిద్ధరామయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఆ తర్వాత ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి పార్టీ హైకమాండ్ను కలిశారు. శుక్రవారం జాతీయ రాజధానిలోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసమైన 10 జనపథ్లో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఈ సమావేశం జరిగింది. దాదాపు గంటసేపు జరిపిన చర్చల్లో కొత్త మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి పదవి తమ వర్గం వారికి ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. ఇక, తన కుమారుడికి, విధేయులకు క్యాబినెట్లో చోటు కల్పించాలని సిద్ధరామయ్య కోరినట్లు వెల్లడించాయి.
తన కుమారుడు యతీంద్రకు వైద్య, విద్య.. వెనుకబడిన తరగతుల వంటి కీలక శాఖల్లో ఏదో ఒకటి కేటాయించాలని ఆయన అడిగినట్లు సమాచారం. లేదంటే గతంలో డీకే శివకుమార్ నిర్వహించిన పరిశ్రమలు, జలవనరుల శాఖ అయినా ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ నియామకాలతో పాటు మంత్రివర్గ పదవుల కేటాయింపులకు సంబంధించి పలువురు నేతల జాబితాను సిద్ధరామయ్య.. రాహుల్ గాంధీకి అందజేశారు. ఇక ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జ్ రణదీప్ సుర్జేవాలాతో కలిసి వచ్చిన సిద్ధరామయ్య, రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటకకు సంబంధించిన పార్టీ అంతర్గత సంస్థాగత సమస్యలతో సహా పలు రాజకీయ, సంస్థాగత అంశాలపై కూలంకషంగా చర్చించారు. రాహుల్ గాంధీతో తన సమావేశాన్ని ముగించిన సిద్ధరామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కూడా కలిశారు.



