- రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు)
నవతెలంగాణ-హైదరాబాద్: త్వరలో నిర్వహించబోయే అంగన్ వాడీల సమావేశానికి నిరంతరం పోరాడుతున్న యూనియన్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈమేరకు బుధవారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్, రాష్ట్ర కమిటీ సభ్యులకు సమావేశానికి హాజరయ్యే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది.
ముందుగా రాష్ట్ర ప్రభుత్వం సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నందుకు యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. దీర్ఘకాలికంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్క ఈ అంశం చాలా ఊరట కలిగిస్తుందని, ఈ సమావేశం ఎలాంటి వివక్ష లేకుండా, కార్మిక సంఘాల హక్కులను కాలరాయకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరంతరం పోరాడుతున్న కార్మిక సంఘాలకు, నాయకత్వానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం సమావేశాల సందర్భంగా కార్మిక సంఘాల హక్కులను అమలు చేయలేదు. పైగా కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తూ ఏకపక్షంగా ఇష్టానుసారంగా సమావేశాలు నిర్వహించింది. దీనివల్ల సమస్యల పైన సమగ్రంగా చర్చ జరగలేదు. ఈ చర్చ జరగకపోవడం వల్ల అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ నేటికి అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు చేయకూడదని, కార్మిక సంఘాల హక్కులను అమలు చేయాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యల పైన నిరంతరం పోరాడుతున్న కార్మిక సంఘాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, సంఘాల వారీగా సభ్యుల సంఖ్యను నిర్ణయం చేయాలని తెలియజేశారు.



