నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచలంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించారు. ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచుల అధ్యక్షతన ఈ గ్రామ సభలను నిర్వహించారు. మండలంలోని నాగపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణ నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో మండల ప్రత్యేక అధికారి రాజా గంగారం పాల్గొని మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం వైపు,రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు.రానున్నది వర్షాకాలం అయినందున ప్రజలందరు తగు జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య, మౌలిక సౌకర్యాలు కల్పించడంతోపాటు, సిజనల్ వ్యాధులు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది అందుబాటులో అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ ప్రత్యేక గ్రామసభల్లో గ్రామాభివృద్ధి కావాల్సిన అంశాలను, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలను, గ్రామ ప్రజల సూచనలను అభిప్రాయలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్, మండల రెవెన్యూ అధికారి శరత్, ఈజీఎస్ ఏపివో విద్యానంద్, ఆయా గ్రామాల సర్పంచులు, పాలకవర్గం సభ్యులు, విద్యుత్ ఏఈ అన్నయ్య, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


