నవతెలంగాణ-బ్యూరో-హైదరాబాద్
విద్యా, వైద్య రంగాల్లో విచ్చలవిడి దోపిడి జరుగుతున్నదనీ, రూ. వేలాది కోట్లను అధిక ఫీజులు, డొనేషన్ల రూపంలో కార్పొరేట్ విద్యా సంస్థలు దండుకుంటున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యులు టి జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్తో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెస్లీ మాట్లాడుతూ.. విద్యా, వైద్యం, నిరుద్యోగం, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, పేదలకు 14 రకాల నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారా అందించాలని తదితర ప్రజా సమస్యలపై ఈ నెల నుంచి ఆగష్టు వరకు క్షేత్ర స్థాయి పర్యటనలను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఆగష్టులో హైదరాబాద్ నగరంలో భారీ ప్రదర్శన, సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రాధమిక పాఠశాలల నుంచి విశ్వ విద్యాలయాల వరకు ఏండ్ల తరబడి పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య కేవలం 16 నుంచి 19 లక్షలు మాత్రమే ఉన్నారని అన్నారు. తగినన్ని తరగతి గదులు, పర్నీచర్, టాయిలెట్లు, కాంపౌండ్ వాల్లు, క్రీడా సామాగ్రి, లైబ్రరీలు లేని పాఠశాలలు వేల సంఖ్యలో ఉన్నాయన్నారు. వసతి గృహాల్లో సౌకర్యాలు సరేసరి అని చెప్పారు. ఇటాంటి పరిస్థితుల్లో బడ్జెట్లో కేటాయింపులు నామమాత్రమే అన్నారు. కేజీటు పీజీ ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. మరో పక్క ప్రయివేటు విద్యా సంస్థల్లో 30 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. వీరి నుంచి ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేస్తున్నారనీ, ఈ విషయం ప్రభుత్వాలకు తెలిసినా ఎందుకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావటం లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లు, పర్యటనలు, ప్రచార ఆందోళనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ రంగంలో 6,500 ఆస్పత్రుల్లో 70 వేల పడకలున్నాయని చెప్పారు.

పదివేలకు పైగా ఉన్న ప్రయివేటు ఆస్పత్రుల్లో లక్షపడకలకు పైగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, ప్రొఫెసర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర సిబ్బంది కొరతతో పాటు నిధుల లేమి తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పక్క కార్పొరేట్ ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని విమర్శించారు. వైద్య ఖర్చులు భరించలేక రోగుల కుటుంబాలు గుల్ల అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రయివేటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ప్రయివేటు ఆస్పత్రులలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు.
జేఏసీలుగా ఏర్పడి ఆందోళనలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను ఎందుకు భర్తీ చేయటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉపాధి అవకాశాలను కల్పించటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో ఫెయిలయిందని విమర్శించారు. రేషన్ షాపుల ద్వారా ఒక వ్యక్తికి ఆరు కేజీలు మాత్రమే రేషన్ ఇస్తున్నారని గుర్తు చేశారు. వాటితో పాటు 14 రకాల సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని పేదలకు తక్షణమే కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఇండ్ల స్థలం లేని పేదలు లక్షల మంది ఉన్నారన్నారు. ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని గుర్తు చేశారు. వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరికి 120 గజాల ఇంటిజాగ ఇవ్వాలని డిమాండ్ చేశారు.



