పకడ్బందీగా తుది ఏర్పాట్లు పూర్తి చేయాలి
ఇంచార్జి కలెక్టర్, మహా శివరాత్రి జాతర కమిటీ చైర్ పర్సన్ గరిమ అగ్రవాల్
వివిధ శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మహా శివరాత్రి జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించి.. విజయవంతం చేయాలని ఇంచార్జి కలెక్టర్, మహా శివరాత్రి జాతర కమిటీ చైర్ పర్సన్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో మహా శివరాత్రి జాతర సందర్బంగా అన్ని శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్, మహా శివరాత్రి జాతర కమిటీ చైర్ పర్సన్ గరిమ అగ్రవాల్ గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమేశ్వర ఆలయంలో మహా శివరాత్రి జాతర సందర్భంగా భక్తులు స్వామి వారి దర్శనాన్ని సౌకర్యంగా చేసుకునేలా తుది దశ ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని ఆదేశించారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా బస్ లు సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. జడ్పీ డిప్యూటీ సీఈఓ, వేములవాడ మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి సంయుక్తంగా ఆలయ పరిసరాలు, పార్కింగ్ స్థలాలు, క్యూ లైన్లు ఇతర చోట్ల మూడు షిఫ్ట్లలో సిబ్బంది ఉండేలా చూడాలని ఆదేశించారు. జాతరకు ముందు నుంచి తరువాత మూడు రోజుల వరకు పారిశుధ్య సేవలు అందించాలని సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆద్వర్యంలో బస్సు స్టాండ్, పార్కింగ్ స్థలాలు, ఇతర చోట్ల పూర్తి వివరాలతో హెల్ప్ డెస్క్ లు సిబ్బంది అందుబాటులో పెట్టాలని, ప్రతి చోట అన్ని వివరాలతో కూడిన సైన్ బోర్డులు పెట్టించాలని తెలిపారు. ఆలయంలోని క్యూల వద్ద, పార్కింగ్ స్థలాల వద్ద, బస్సు స్టాండ్లలో తాగు నీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. సెస్ అధికారులు భీమేశ్వర ఆలయం, బద్ది పోచమ్మ ఆలయం, ఇతర చోట్ల 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు కూడా చేసుకోవాలని, అధికారులు, సిబ్బంది ఉండాలని తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖా ఆద్వర్యంలో భీమన్న ఆలయం, ప్రసాదం కౌంటర్, పార్కింగ్ స్థలాలు ఇతర చోట్ల వైద్యులు, సిబ్బంది, అంబులెన్స్ లతో సిద్దంగా ఉండాలని వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా, అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అగ్ని మాపక శాఖా అధికారులు ప్రధాన ఆలయాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు చెక్ చేయాలని, వారి సిబ్బంది గుడి ఆవరణలో జాతర సమయంలో సిద్దంగా ఉండాలని సూచించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు భక్తులకు అందించే ప్రసాదం, ఇతర ఆహార పదార్థాలను పరిశీలించాలని ఆదేశించారు. క్యూ లైన్లు, వీఐపీలు, కళ్యాణ కట్ట, ఇతర చోట్ల రద్దీ నియంత్రణ, దర్శనం పూర్తి చేసేందుకు జిల్లా స్థాయి అధికారులను నియమించామని, వారు ఆయా ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. కోడెల నిర్వహణ, సంరక్షణ జిల్లా పశు సంవర్ధక శాఖ, ఆలయ అధికారులు సమన్వయంతో చూసుకోవాలని ఆదేశించారు.
జాతర ఆవరణలో ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా చూడాలని సూచించారు. వృద్ధులు,దివ్యాంగులకు సహాయం కోసం వీల్ చైర్లు వాలంటీరను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతర విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి కావాల్సిన గదులు, ఆహారం, ఇతర సదుపాయాలు వేములవాడ ఆర్డీఓ, ఆలయ అధికారులు చూసుకోవాలని సూచించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని, జాతరకు వచ్చే భక్తులకు ఎక్కడా దర్శనం, వసతులలో ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేసారు. మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని, వీఐపీ, వీవీఐపీల దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్ లో ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, ఆలయ ఈఓ రమాదేవి తదితరులు ఉన్నారు.
సమన్వయంతో మహా శివరాత్రి జాతర విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -



