సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో
న్యూఢిల్లీ : సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి సీపీఐ(ఎం) అభినందనలు తెలియచేసింది. ఈ మేరకు పొలిట్బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను నోటిఫై చేయడాన్ని, హక్కుల ప్రాతిపదిక కలిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఒక రకంగా రద్దు చేసేయడాన్ని నిరసిస్తూ, అలాగే కార్మిక, కర్షక వ్యతిరేక చర్యలను, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక లోకం చేపట్టిన నిరసనలో రైతులు, వ్యవసాయ కూలీలు కూడా పాల్గొన్నారు. కార్మిక వర్గం తన వాణిని మరింత బిగ్గరగా, స్పష్టంగా వినిపించింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరించే వివిధ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించిన కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు సీపీఐ(ఎం) సంఘీభావాన్ని పునరుద్ఘాటించింది.
ప్రభుత్వం తక్షణమే నాలుగు లేబర్ కోడ్ల నోటిఫికేషన్ను రద్దు చేసుకోవాలని, కార్మికులు ఎంతో కష్టపడి సాధించిన హక్కులను పరిరక్షించుకోవాలని పొలిట్బ్యూరో పేర్కొంది. విబి-జిఆర్ఎఎంజి చట్టాన్ని రద్దు చేయాలని కోరింది. విద్యుత్ పంపిణీ ప్రయివేటీకరణ ప్రతిపాదనను, విత్తన బిల్లును ఉపసంహరించుకోవాలని కోరింది. అలాగే ప్రభుత్వం సంతకాలు చేసిన వివిధ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ముఖ్యంగా అమెరికా, యూరప్తో కుదుర్చుకున్న ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని కోరింది. ఇవన్నీ కూడా భారత కార్మిక వర్గానికి, రైతాంగానికి, మొత్తంగా ప్రజానీకం ప్రయోజనాలకు తీవ్ర వ్యతిరేకంగా వున్నాయని పొలిట్బ్యూరో విమర్శించింది.



