నవతెలంగాణ-హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సీఎం రేవంత్రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ స్కూల్ను బుధవారం ఉదయం సీఎం రేవంత్ ప్రారంభించారు. స్కూల్లోని డిజిటల్ క్లాస్రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, డైనింగ్ హాల్ను పరిశీలించారు. విద్యా వసతులపై విద్యార్థులు, టీచర్లు, స్కూల్ కమిటీ సభ్యులతో మాట్లాడారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని టీం ప్రత్యేక పర్యవేక్షణలో ఆరుట్ల టీపీఎస్ రూపుదిద్దుకుంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్లో విద్య అందుతుంది. ఆ స్కూల్లో హైటెక్ వసతులు కల్పించారు. గాలి, వెలుతురు వచ్చే విశాలమైన గదులు, డిజిటల్ బోర్డులు, అత్యాధునిక ల్యాబ్స్, జిమ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, టెన్నిస్, కబడ్డీ వంటి ఆటల కోసం ప్రత్యేక కోచ్లను నియమించారు.
ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి ఐదు స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ప్రయివేటు స్కూళ్లలో చదువుతున్న పిల్లలను సైతం టీపీఎస్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ-ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ స్కూల్లో 600 మంది, హైస్కూల్ రెండు బ్లాకుల్లో కలిపి 800 మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోలేక ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి టీపీఎస్లో నెలకొంది.



