బెంగాల్తో రంజీ ట్రోఫీ సెమీఫైనల్
కోల్కతా : రంజీ ట్రోఫీ చరిత్రలో జమ్మూ కశ్మీర్ తొలిసారి ఫైనల్కు చేరుకునే సువర్ణావకాశం ముంగిట నిలిచింది. మహ్మద్ షమి (8/90) ఎనిమిది వికెట్లతో నిప్పులు చెరగటంతో జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 302 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో బెంగాల్కు 26 పరుగుల ఆధిక్యం కోల్పోయింది. కానీ జమ్మూ కశ్మీర్ బౌలర్లు సునీల్ కుమార్ (4/27), అకిబ్ నబి (4/36), యుధ్వీర్ సింగ్ (2/29) సమిష్టిగా మెరవటంతో బెంగాల్ రెండో ఇన్నింగ్స్లో 25.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది.
బెంగాల్ ఆటగాళ్లలో సుదీప్ ఛటర్జీ (0), సుదీప్ కుమార్ (0) డకౌట్ కాగా.. అభిమన్యు ఈశ్వరన్ (5), గుప్తా (8) తేలిపోయారు. షాబాజ్ అహ్మద్ (24), మంజుదార్ (12), హబిబ్ గాంధీ (10), మహ్మద్ షమి (11) మాత్రమే రెండెంకల స్కోరు సాధించారు. 126 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో జమ్మూ కశ్మీర్ 13 ఓవర్లలో 43/2తో ఆడుతోంది. శుభమ్ (23 నాటౌట్), శర్మ (9 నాటౌట్) అజేయంగా క్రీజులో నిలిచారు. ఆకాశ్ దీప్ (2/12) రెండు వికెట్లు పడగొట్టాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి జమ్మూ కశ్మీర్ విజయానికి మరో 83 పరుగుల దూరంలో నిలిచింది.
ఉత్తరాఖాండ్ ఎదురీత
కర్నాటకతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ఉత్తరాఖాండ్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 69 ఓవర్లలో 149/5 పరుగులు చేసింది. లక్ష్య (52 నాటౌట్) అర్థ సెంచరీతో మెరువగా.. జగదీశ్ (21), అవనీశ్ (27) మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేదు. మూడో రోజు ఆట ముగిసేసరికి ఉత్తరాఖాండ్ తొలి ఇన్నింగ్స్లో మరో 587 పరుగుల వెనుకంజలో నిలిచింది. అంతకముందు, కర్నాటక తొలి ఇన్నింగ్స్లో 736 పరుగుల భారీ స్కోరు చేసింది. దేవదత్ పడిక్కల్ (232), కెఎల్ రాహుల్ (141), రవిచంద్రన్ స్మరణ్ (135) సెంచరీలు సాధించారు.



