ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో గురుకుల సొసైటీ కార్యదర్శి హామీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని సాంఘీక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల పాఠశాలల పనివేళలను ఉపాధ్యాయులు కోరుతున్న విధంగా సవరిస్తామని గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణ అదిత్య హామీ ఇచ్చారు. సాంఘీక సంక్షేమ గురుకులాల సొసైటీలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించటానికి ఉపాధ్యాయ సంఘాలతో హైదరాబాద్లో ఆయన సమావేశం నిర్వహించారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్, సాంఘీక సంక్షేమ గురుకులాల సొసైటీ విభాగం నాయకులు ఎల్లయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ…విద్యార్థుల సంక్షేమానికి ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇవ్వాలనీ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీనిచ్చారు.
ఉపాధ్యాయుల సమస్యలపై టీఎస్ యుటీఎఫ్ ఇచ్చిన ప్రాతినిధ్యంపై స్పందిస్తూ ప్రమోషన్ ప్రక్రియ త్వరలో చేపడతామనీ, సమయం మార్పు చేయడంతోపాటు రాత్రి విధులు నిర్వహించిన వారికి మరుసటి రోజు ఉదయం 9:00కి అనుమతించడానికి అంగీకరించారు. పార్ట్ టైం టీచర్ల వేతనాలు రెండు రోజుల్లో విడుదల చేస్తామనీ, రెగ్యులర్ ఉపాధ్యాయులకు 010 వేతనాల అమలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు, కేర్టేకర్గా అదనపు పోస్టులు మంజూరుకు, ప్రిన్సిపాల్ ప్రమోషన్లో సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ 100 శాతం ప్రమోషన్ల ద్వారా భర్తీచేస్తామని హామీనిచ్చారు. జాయింట్ సెక్రటరీలు సక్రూనాయక్, శారద, గీత, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



