నవతెలంగాణ-హైదరాబాద్ : ఖతార్లోని ప్రముఖ గ్యాస్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు భారతీయులతో సహా 13 మంది మరణించారు. మరో 66 మంది గాయపడ్డారు. ఖతార్ ప్రభుత్వంతో పాటు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం దీనిని ధృవీకరించింది. ఆ దేశ ప్రధాన ఎల్ఎన్జీ ఉత్పత్తి, ఎగుమతి కేంద్రమైన విశాలమైన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఈ సంఘటన జరిగింది. బర్జాన్లోని గ్యాస్ సరఫరా కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ఏడాది ఆరంభంలో ఇరాన్ క్షిపణి దాడి కారణంగా నిలిచిపోయిన ఈ ప్లాంట్లో ఉత్పత్తిని పునరుద్ధరించే సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ పేలుడు ధాటికి పలు భవనాలు కంపించాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని దోహా ప్రాంతంలో కూడా దీని ప్రభావం కనిపించింది.
కాగా, ఈ ప్రమాదంలో భారతీయులతో సహా 13 మంది మరణించినట్లు సమాచారం. మరో 66 మంది గాయపడ్డారని, కొందరి ఆచూకీ తెలియలేదని ఖతార్ ఇంధన శాఖ తెలిపింది. మృతులు, గాయపడిన వారి జాతీయత వివరాలను ఆ దేశ అధికారులు వెల్లడించలేదు. గ్యాస్ ప్లాంట్లో పేలుడును ‘సాంకేతిక ప్రమాదం’గా పేర్కొన్నారు.
మరోవైపు దోహాలోని భారత రాయబార కార్యాలయం ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఆదివారం జరిగిన దురదృష్టకర ఘటనపై దోహాలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర ఆందోళన చెందుతోంది. అధికారుల సమాచారం ప్రకారం ఈ ఘటనలో పలువురు గాయపడగా, మరికొందరు గల్లంతయ్యారు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.



