మాజీమంత్రి హరీశ్రావు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
షాపుల్లో అమ్మాల్సిన యూరియాను యాప్ల్లో ఇస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్భాటం చేశారని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. యూరియా అందక రైతుల ఆక్రందన వినిపించడం లేదా?అని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుండెలు మండి ఈ ప్రభుత్వంపై తిరగబడుతున్న అన్నదాత రోదన అర్థమవు తుందా?అని ప్రశ్నించారు. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రైతులందరిదీ ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. యూరియా కోసం రైతులు చెప్పులు వరుసలో పెట్టే ఆనాటి రోజులు తేవడమేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు?అని ఎద్దేవా చేశారు.
నిరక్షరాస్యులు, స్మార్ట్ ఫోన్ లేని లక్షలాది మంది రైతులు ఏ విధంగా యాప్ను వినియోగిస్తారన్న కనీస సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల ఇంత కర్కషంగా, కఠినంగా వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ సమాజం గమనిస్తున్నదని తెలిపారు. యూరియా యాప్ను రద్దు చేసి, పాత విధానంలో ఎలాంటి షరతుల్లేకుండా రైతులకు యూరియాను సరఫరా చేయాలని హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే యూరియా కష్టాలు భరించని రైతులు సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ను ముట్టడించే రోజులు వస్తాయని హెచ్చరించారు.
యాప్ను రద్దు చేసి యూరియా సరఫరా చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



