Thursday, April 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏపీ రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌ను సవరించాలి

ఏపీ రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌ను సవరించాలి

- Advertisement -

– తద్వారా తెలుగు రాష్ట్రాల్లో సీట్లను పెంచుకోవచ్చు : కె.కేశవరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటులో సవరించడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు కె.కేశవరావు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రొఫెసర్‌ కోదండరాం, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ యాక్ట్‌లోని 26వ సెక్షన్‌ ద్వారా తెలంగాణలో 119 స్థానాల నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225 సీట్లకు పెంచుకునేందుకు అవకాశముందని తెలిపారు. అయితే యాక్ట్‌లో అవకాశం కల్పిస్తూనే రాజ్యాంగంలోని 170వ ప్రకరణకు లోబడి అనే షరతు ఆటంకంగా ఉందని తెలిపారు. లోబడి అనేది తొలగిస్తూ పార్లమెంటు చేసిన రీఆర్గనైజేషన్‌ చట్టంతోనే చేసుకునేలా చర్యలు తీసుకుంటే సరిపోతుందన్నారు. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఇరువురు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లు పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కె.కేశవరావు విమర్శించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్‌ను – డీలిమిటేషన్‌ బిల్లుతో ముడిపెట్టకుండా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ బిల్లు 2023లోనే ఏకగ్రీవంగా అమలయిందని చెప్పారు. డీలిమిటేషన్‌ బిల్లులో 50 శాతం పెంచుకునేందుకు అవకాశం లేదనీ దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్లలో దక్షిణాదికి, ఉత్తరాదికి మధ్య 283 సీట్ల తేడా ఉందనీ, కేంద్రం తెచ్చిన బిల్లు చట్టమైతే ఆ తేడా 420కి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక సామంత రాజ్యాలను భారతదేశంలో భాగస్వాములు చేసేందుకు వారు పెట్టిన షరతులు, డిమాండ్లపై అందరితో చర్చించి నాటి ప్రధానమంత్రి పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం అఖిలపక్ష నిర్ణయాన్ని స్వీకరించిందని తెలిపారు. అదే మార్గంలో దేశ భవిష్యత్తును నిర్ణయించే డీలిమిటేషన్‌ పై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షం అభిప్రాయాన్ని తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -