హోంగార్డుకు తీవ్ర గాయాలు
జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం..
హైవే అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికుల ఆరోపణ
నవతెలంగాణ-పెద్దకొడప్గల్
మండల కేంద్రంలోని జాతీయ రహదారి-161పై మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా, హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్ మండలానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ రాజ్కుమార్ పిట్లం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి హోంగార్డ్ మధుతో కలిసి మద్నూర్ నుంచి పిట్లం పోలీస్ స్టేషన్కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్నారు.
ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ రాజ్కుమార్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. హోంగార్డ్ మధుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన లారీ సోమవారం నుంచే జాతీయ రహదారిపై చెడిపోయి నిలిచి ఉంది. అయినప్పటికీ హైవే సిబ్బంది హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు లేదా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయలేదని, అలాగే లారీని రహదారి పక్కకు తరలించేందుకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమైందని స్థానికులు పేర్కొన్నారు.



