– ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలు అందాలి
– బీఎల్ఓలుగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
– నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అశ్వారావుపేట నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ మండలస్థాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని డ్రైవర్స్ కాలనీలో ఉన్న 166, 167 పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్ఓలు జ్యోతి, మౌనికలను ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్కానింగ్ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్హ ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. స్థానిక మహిళా ఓటర్లతో మాట్లాడి ఫారాల పంపిణీపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ దాసరి కిశోర్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓ ముత్తమ్మ, బీఎల్ఓలుగా విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని, ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలు చేరేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్ హుస్సేన్, ఆర్ఐ లు పద్మావతి, కృష్ణ, సిబ్బంది కొత్తపల్లి రాము, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.




