Saturday, February 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిష కౌగిలి!

విష కౌగిలి!

- Advertisement -

ఇజ్రాయిల్‌ పర్యటన ముగించుకున్న మన ప్రధాని దేశానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో ఏం తెచ్చారు? వ్యూహాత్మక లాభాలా? దౌత్య వివాదాలా? అన్నది తెలియాలి. గాజా మంటల్లో వేలాది పౌరులు ప్రాణాలు కోల్పోతున్న వేళ ఆ దేశ సందర్శన ఎవరికి ఉపయోగం? ఇప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ రాజకీయాల్లో దేశాల మధ్య వైరు ధ్యాలు వాటి ప్రయోజనాలకంటే తరచూ ముందుకు రావడం కొత్త విషయం కాదు. కానీ, అవి దేశ ఆర్థిక, దౌత్య, నైతికస్థితిని ప్రభావితం చేసే స్థాయికి చేరితే గనుక ప్రశ్నించడం పౌరుల హక్కు. భారత ప్రధాని ఇజ్రాయిల్‌ పర్యటన కచ్చితంగా మనకు అలాంటి బాధ్యతను గుర్తుచేస్తుంది. ప్రపంచ పరిణామాలు, సమీకరణలు శరవేగంగా మారుతున్న సమయంలో ఈ పర్యటన అనేక సందేహాలను లేవనెత్తింది. ఓ వైపు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, మరోవైపు వెనిజులా అధ్యక్షుడి కిడ్నాప్‌, ఇంకోవైపు ఇరాన్‌లో యుద్ధ వాతావరణం, అమెరికా టారిఫ్‌ల పెత్తనం- ప్రజలను కలవరపెడుతున్న సమయంలో ప్రధాని ఇజ్రాయిల్‌ పర్యటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే మోడీ వ్యవ హరించిన తీరు, ప్రసంగం సామ్రాజ్యవాద దేశానికి లొంగుబాటులా కనిపించింది!

శాంతి, స్థిరత్వం గురించి ప్రసంగించిన ప్రధాని గాజాలో నలుగు తున్న పాలస్తీనా ప్రజల గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. శిథిలాల మధ్య విలపిస్తున్న చిన్నారుల కేకలు ఆయన చెవులకు వినిపించలేదా? వేలాది పౌరుల మరణాలు, ఆకలి, నిరాశ్రయత్వం- ఇవన్నీ ప్రపంచదేశాలను కదిలిస్తున్నప్పుడు భారతదేశం మౌనభాషనే ఎం దుకు ఎంచుకుంది? ఒక పక్షానికి మద్దతుగా కనిపించే ఈ సన్నిహితత మన చారిత్రక విలువల్ని, సమానత్వ భావాన్ని, విదేశాంగ విధానాన్ని ఎక్కడికి తీసుకెళ్తోంది? దేశాల మధ్య మిత్రుత్వం కాదనలేం, కానీ మానవత్వం కన్నా మారణ హోమం పైచేయి సాధిస్తుంటే, ఆ మైత్రి దేశ గౌరవానికే ప్రశ్నగా మారదా? ఎనిమిది దశాబ్దాల పాలస్తీనా స్వతంత్ర పోరాటాన్ని, ప్రజల ఆకాంక్షను బాంబుల వర్షంతో, తుపాకీి గొట్టాలతో అణచివేస్తున్న ప్రపంచ నేరస్తుడు నెతన్యాహు. అంతర్జాతీయ న్యాయస్థానమే అతన్ని దోషిగా ప్రకటించింది. అతని విషకౌగిలిలో భారత్‌ను బంధీగా మార్చడం ప్రమా దాన్ని కొనితెచ్చుకున్నట్టే కదా! ఒక జాతి హననం, మానవ హక్కులు ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నా ఎన్నడూ దానిగురించి మోడీ ప్రస్తా వించింది లేదు, ఆ చర్యల్ని ఖండిం చనూ లేదు. ఇప్పుడేమో హమాస్‌ను వ్యతిరేకిస్తున్నానని, శాంతి స్థాపనకు ఇజ్రాయిల్‌తో కలిసి పనిచేస్తానని చెప్పడం హాస్యాస్పదం.

అసలు నెతన్యాహును కలిసేందుకే చాలామంది దేశాధినేతలు వెనుకంజ వేస్తున్న పరిస్థితి. అతనితో భేటీ అగౌరవానికి సూచికగా భావిస్తున్న వైనం. మోడీ మాత్రం నిస్సిగ్గుగా కలవడం దేనికి సంకేతం. వీరిద్దరి ఆలోచనలు, వ్యూహాలు, అణచివేతలు, సిద్ధాంతాలు ఒకేలా ఉంటాయని ప్రచారం. అక్కడ ఒక జాతిని నిర్మూలిస్తుంటే, ఇక్కడ మత విద్వేషాలు రగిలించడం, ప్రాంతీయ విభేదాలతో అంటకాగడం దేశమంతా చూస్తున్నదే. గుజరాత్‌ మారణ హోమం దేశ రాజకీయ చరిత్రలో మాయని మచ్చ. అది నేటికీ మానని గాయం. ఆ సిద్ధాంతాన్నే బీజేపీ నమ్ముకుని పనిచేస్తోంది. ఆరెస్సెస్‌ అధినేత గోల్వాల్కర్‌ రాసిన పుస్తకంలో కూడా అదే గోచరిస్తుంది. ”జాతి మరియు దాని శుద్ధతను కాపాడు కునేందుకు జర్మనీ యూదులను తొలగించింది. దాన్నిచూసి మనజాతి అత్యున్నతస్థాయిలో గర్వపడు తోంది. మూలాల్లోనే భిన్నతలు, అలా ఉన్న జాతులు సంస్కృతులు ఏకీకృతం కావడమనేది అసాధ్యం. ఇది జర్మనీ నిరూపించింది. హిందూస్థాన్‌లో కూడా మనం దీన్నుంచి నేర్చుకోవాలి” అని అందులో పేర్కొన్నారు. జర్మనీ ఊచకోతను సమర్థించడం కోసం, ఇక్కడ మైనార్టీలనూ అదేవిధంగా ఉద్దేశించడం గమనించాలి. జర్మనీలో హిట్లర్‌ యూదులను బంకర్‌లో పెట్టి చంపేశాడు. దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని గోల్వాల్కర్‌ చెప్పాడు. అదే యూదులకు నాయకునిగా ఉన్న నెతన్యాహుకు మద్దతుగా ఉంటానని చెప్పడం, ఇదే బీజేపీ రాజకీయం!

ప్రతీ దేశానికి పరస్పర సహకారం, భద్రత అవసరమే. కానీ, ఆ చర్యలు మానవ హక్కుల ప్రమాణాలు దాటిపోతే ఏంటన్నది ప్రశ్న. పౌరుల ప్రాణనష్టం పెరిగితే అప్పుడు ప్రజాస్వామ్యం తన నైతిక అధికారాన్ని కోల్పోతుంది. మోడీ పాలనలో జరుగుతున్నది అదే! భారతదేశం చారిత్రాత్మకంగా పాలస్తీనా ప్రజల హక్కులకు మద్దతుగా నిలిచింది.అదే సమయంలో ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక సంబంధాలు పెంచుకుంది. ఈ సమతుల్యతే మన విదేశాంగ విధానం.కానీ, ఒక పక్షానికి దగ్గరవడం కోసం, మరోపక్షం బాధను ప్రస్తావించకపోవడం అసమతుల్యతను పెంచు తుంది. భారత్‌ ప్రజాస్వామ్య విలువకు ప్రతీకగా నిలవాలి. కానీ, ఈ మైత్రిబంధం మన ప్రజాస్వామ్యాన్ని మింగేయ కూడదు. మోడీ ఇజ్రాయిల్‌ పర్యటన ముగిసింది. కానీ, అది లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడే మొదలయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -