Saturday, February 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిరాజ్యాంగ వ్యవస్థలపై హిందూత్వ స్వారీ

రాజ్యాంగ వ్యవస్థలపై హిందూత్వ స్వారీ

- Advertisement -

కొన్ని తరగతులకు చెందిన లబ్ధిదారులకు నగదు బదిలీ ప్రయోజనాలను ఇక వదులుకోవలసి వుంటుందనే తరహాలో ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) నిశితమైన, సుస్పష్టమైన ప్రకటన ప్రకటన చేశారు. సరైన రీతిలోనే దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అందుకు బదులుగా ప్రభుత్వాలు శాశ్వత ఆస్తులు సమకూర్చడంపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు ప్రజా సంక్షేమం కోసం సోషలిస్టు దేశాలు తీసుకున్న చొరవ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పెట్టుబడిదారీ ప్రజాస్వామికంలో సంక్షేమ రాజ్యం అన్న భావన రావడానికి కారణమైంది. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటిలోనూ ప్రత్యేకించి పాశ్చాత్య దేశాలలో సంక్షేమం అనే భావన రావడానికి వెనక మూలం ఇదే.

లక్షిత వర్గాలకు నగదు బదిలీ అన్నది ఈ విధమైన విధాన క్రమంలోనే రూపొందింది. కొన్ని సందర్భాలలో అది వక్రీకరణలకూ గురైంది. అయినప్పటికీ మొత్తం మీద ఆ తరహా నగదు బదిలీలకు ఆమోదం లభించింది. యుద్ధానంతర ప్రజాస్వామిక వ్యవస్థలలో అలాంటి కేటాయింపులు బడ్జెట్‌ ప్రక్రియలో అంతర్భాగంగా ఆమోదం పొందాయి. పెట్టుబడిదారీ రాజ్యాల రాజ్యాంగ క్రమంలో శాసన, పాలనా, న్యాయ వ్యవస్థలనేవాటి మధ్య స్పష్టమైన అధికార విభజన వుంది. పాలనా వ్యవస్థలో తనిఖీలు, సమతుల్యతల కోణం నుంచి చూస్తే ఈ అంగాల మధ్య ఖచ్చితమైన పని విభజన రాజ్యాంగ ప్రక్రియలో ఒక తప్పనిసరి నిర్దేశం.

స్పష్టమైన విభజన
రెండవ ప్రపంచ యుద్ధం ఫలితాల నేపథ్యంలో ఉల్లేఖించబడిన భారత రాజ్యాంగం ప్రకారం బడ్జెట్‌ రూపకల్పన పూర్తిగా శాసన వ్యవస్థకు మాత్రమే సంబంధించిన అధికారం. రాజకీయాధికారంతో కార్యనిర్వాహక వర్గం ప్రతిపాదించే దాన్ని శాసనవ్యవస్థ ఆమోదించవలసి వుంటుంది. తాము భవిష్యత్తులో తీసుకువచ్చే బడ్జెట్‌ ప్రతిపాదన సవివరంగా కాకున్నా రేఖామాత్రంగా ఎన్నికల సమయంలోనే చెప్పడం జరుగుతుందనేది బాగా తెలిసిన విషయమే. అది ప్రజాస్వామిక ప్రక్రియను మరింత లోతుగా వేళ్లూనేలా చేసి సుసంపన్నం గావిస్తుంది. పూర్తిగా శాసన వ్యవస్థకూ పాలనాధికార వ్యవస్థకు సంబంధించిన ఇలాంటి అంశంలో న్యాయ వ్యవస్థ తలదూర్చడానికి అవకాశమే లేదు. అయితే మతతత్వ కార్పొరేట్‌ కూటమి చేతుల్లో అత్యధికంగా అధికార కేంద్రీకరణ, విధాన నిర్దేశం పోగుపడిన ఈ తరుణంలో సిజెఐ ఆ విభజన రేఖను అతిక్రమించినట్టు కనిపిస్తుంది. ఈ విధమైన అతిక్రమణ రాజ్యా ంగం నిర్దేశిం చిన ప్రక్రియను ఉల్లంఘించడమే అవుతుంది. రాజ్యంగ ఏర్పాట్లలోని అధికారాల విభజ నలను, సమతుల్యతను చిందరవందర చేస్తుంది. అందు వల్లనే సిజెఐ అభిప్రాయాలు రాజ్యాంగ ప్రక్రియను తీవ్రంగా దెబ్బకొట్టినట్టవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ధోరణులకు ఇది మచ్చుతునక వంటిదే. హిందూత్వ భావనలు సర్వాన్ని ఆక్రమించేసిన ప్రస్తుత వాతావరణంలో ఇలాంటి అతిక్రమణలు నిత్యకృత్యంగా మారాయి. నిజం చెప్పాలంటే హిందూత్వ శక్తుల ఒత్తిడితో అధికార వ్యవస్థ తక్కిన రెండు వ్యవస్థలను నొప్పిస్తూ వాటి ఉనికినే హరిస్తున్నది. న్యాయ వ్యవస్థతో సహా మిగిలిన స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ బలహీన పర్చడమే గాక తూట్లు పొడుస్తున్న ధోరణి ఇదే.

‘సర్‌’ విషయంలో ఏమైంది?
భారత ఎన్నికల కమిషన్‌ (ఇసిఐ) ప్రత్యేక సమగ్ర పరిశీలన (ఎస్‌ఐఆర్‌- సర్‌) నిర్వహించాలని నిర్ణయించినపుడు ఇదే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించి దూరంగా వుండిపోయిన తీరుకు సిజెఐ ప్రస్తుత వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా వున్నాయి. ‘సర్‌’ ప్రక్రియకు తీసుకున్న నమూనా, అను సరించిన పద్ధతుల కారణంగా ఆరు రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో కోటీ 70 లక్షల మంది ఓటర్లు తుది జాబితాల నుంచి తొలగించబడినట్టు పత్రికలు వెల్లడించాయి. దేశవ్యాపితంగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేసరికి తొలగించబడే ఓటర్ల సంఖ్య మరెంత వుంటుందో తెలుసుకోవడానికి ఇదొక సంకేతం మాత్రమే. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఓటు హక్కు ఒక రాజ్యాంగ హక్కు అని ఇదే సుప్రీంకోర్టు ఆమోదించిన విషయం. కానీ అది పూర్తిగా ఎన్నికల సంఘం విచక్షణాధికార మైనందున ఇతర రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రతను దెబ్బ తీయరాదనే వాదనే సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకుండా వుండిపోవడానికి కారణమైంది.
కానీ ఆసక్తికరమైంది ఏమంటే ఆ విధంగా ఓటర్ల తొలగింపు తీరు మాత్రం ఈ సమయంలో రాజకీయ పాలనా వ్యవస్థకు అతి ముఖ్యమైన ఒక అధినేతగా వున్న అమిత్‌ షా మాట ప్రకారం నడిచినట్టు కనిపిస్తుంది. గాలించు, తొలగించు, తరలించు అనే ఆలోచనా ధోరణినే ప్రతిబింబిస్తుంది. ఓటర్ల జాబితాలన్నీ చొరబాటు దారులతో నిండి వున్నాయంటున్న హిందూత్వ ప్రచారాన్ని, తగు పత్రాలు లేని ప్రతి పౌరుడినీ ఒక చొరబాటుదారుగా చూసే ధోరణిని ప్రతిబింబించింది. అయితే పౌరసత్వ నిర్ధారణ పూర్తిగా హోం శాఖ నాయకత్వంలోనే జరగాలని పార్లమెంటు వాస్తవీకరించిన రాజ్యాంగం పౌరసత్వ సవరణ చట్టం ఆమోదించడం ద్వారా రాజ్యాంగం చెబుతున్నప్పటికీ ఇలా జరిగిపోతున్నది.

అసలైన ప్రమాదం
ఏమైనా కేవలం ఇసిఐ మంకుపట్టు మాత్రమేగాక సుప్రీంకోర్టు తిరస్కారం కూడా ఆందోళన కలిగిస్తున్నది. సర్‌ ప్రక్రియ పట్ల తీవ్ర నిరసన పెరిగిపోతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును న్యాయంగా జోక్యం చేసుకోవాలని, పౌరుల రాజ్యాంగ హక్కులను కాపాడలనీ కోరాయి. అయితే ఏ రీతి, నీతి చూపకుండానే సుప్రీంకోర్టు నిర్ణయాత్మక జోక్యానికి నిరాకరించింది. ఇక పౌరసత్వ నిర్ధారణ హక్కును ఇసిఐ బలవంతంగా కబళించడానికి చేసిన ప్రయత్నాన్ని ప్రశ్నించడం సంగతి సరేసరి. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓటర్ల తొలగింపునకు ఉద్దేశించిన ఫారం 7ను చాలా తప్పుడు పద్ధతుల్లో దుర్వినియోగం చేయడాన్ని మనం చూడవలసి వచ్చిందంటే కారణమదే. ఇది ఊహించిన ఫలితమే. మతపర మైన మైనారిటీలు అనేకమంది పేర్లు పెద్ద సంఖ్యలో తొలగించ బడినాయి.
వేర్వేరు వ్యవస్థలను హిందూత్వ భావనా ధోరణి ఆవరించిన తీరుకు ఇది చాలా స్పష్టమైన సంకేతం. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడుగా వున్న రాహుల్‌ గాంధీ జోక్యం చేసుకోవడాన్ని జాతీయ భద్రతకు అతి పెద్ద ప్రమాదంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు అభివర్ణించడం ఇందుకో కఠోరమైన వ్యక్తీకరణ. ఇది శాసనవ్యవస్థ స్వతంత్రత అనే సూత్రాన్ని పచ్చిగా తిరస్కరించిన ఫలితమే. ఎందు కంటే ప్రతిపక్ష నేత స్థానం చట్టసభ స్వతంత్రతకు ప్రతీక.
వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయకుండా హిందూత్వ పోకడ పూర్తిగా విచ్ఛిన్నం చేస్తున్నదని పగటి వెలుగులా సుస్పష్టంగా తెలిసిపోతున్నది. క్లుప్తంగా చెప్పాలంటే రాజకీయ ప్రక్రియలో నయా ఫాసిస్టు ప్రక్రియల ప్రవేశం సారాంశంగా వుంది. దేశానికి ప్రజలకూ ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యానికి ఇదే ప్రాణాంతక ప్రమాదమవుతున్నది. వ్యవస్థల అధికారాలను కుదించేందుకు జరిగే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి మనం సిద్ధం కావాలి. అవే ఉత్తరోత్తరా మన రాజ్యాంగం స్వరూపాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి.
(ఫిబ్రవరి 24 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -