నవతెలంగాణ – భువనగిరి
అమరజీవి కామ్రేడ్ సంగు రవీందర్ 11వ వర్ధంతి స్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గద్దె నర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో కామ్రేడ్ సంగు రవీందర్ 11వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సంగు రవీందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించినారు.
అనంతరం సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నర్సింహ లు పాల్గొని మాట్లాడారు. కామ్రేడ్ సంగు రవీందర్ చిన్ననాటి నుండే ఎర్ర జెండా నాయకత్వంలో విద్యార్థులు, యువజనలు, రైతులు, వ్యవసాయ కూలీలు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, వృత్తిదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించే దాంట్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ప్రధానంగా నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికుల హక్కులను కాలరాసిందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో పేదలకు వ్యవసాయ కూలీలకు కీలకంగా ఉపయోగపడుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంను కూడా మార్చి కూలీల పొట్ట కొడుతున్నారని అన్నారు.
మరోపక్క రైతులకు, పేదలకు ఉపయోగపడుతున్న విద్యుత్ సబ్సిడీని ఎత్తివేయడానికి విద్యుత్ సవరణ బిల్లును కూడా తీసుకొచ్చారని, రైతాంగానికి నష్టం చేసే విధంగా విత్తన చట్టాన్ని తెచ్చారని ఈ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పోరాడాలని కోరారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానాలు అనేకం ఇచ్చి వాటిని అవలు మాత్రం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలు ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు, ఇండ్లు నిర్మాణం చేసుకుంటే వాటికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వవలసిందిపోయి ఆ భూములను ఆక్రమించుకొని డబ్బులు దండుకోవడానికి పేదల ఇండ్లను కూలగోడుతున్నారని పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని లేకపోతే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని వారు హెచ్చరించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, గంధమల్ల మాతయ్య, కల్లూరి నాగమణి, భువనగిరి మండల పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు కొండమడుగు నాగమణి, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు బర్ల వెంకటేష్, వల్దాసు అంజయ్య, నాయకులు ఎండి. సలీం, మధ్యబోయిన సుందర్, ఎం.శంకర్ పాల్గొన్నారు.



