– వర్షాభావంతో సాగు వెనుకంజ
– మరో మూడు రోజుల్లో 15 – 45 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం
– ప్రభుత్వం నిర్ధారించిన ఏడు రకాల సన్నాలకే బోనస్
– రైతులకు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పెంటేల రవికుమార్ సూచనలు
నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్లో ఈ వానాకాలం సాగు ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదు. సాధారణంగా ఈ సమయానికి పత్తి 30,357 ఎకరాలు, వరి 40,205 ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా, వర్షాల ఆలస్యంతో పత్తి 20,592ఎకరాల్లో, వరి 1264ఎకరాల్లో సాగయ్యాయి.
మండలాల వారీ సాగు వివరాలు
మండలం ఎకరాల్లో
మండలం పత్తి వరి
అన్నపురెడ్డిపల్లి 600 140
అశ్వారావుపేట 2,124 0
చంద్రుగొండ 5,100 0
దమ్మపేట 4 1124
ములకలపల్లి 5,970 0
మొత్తం 20,592 1264
వ్యవసాయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వరి సాగు కోసం రైతులు ఇప్పటికే నారుమడులు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ సోనా (RNR-15048) రకం వరి సాగు కోసం ప్రస్తుతం నారు మడి తయారీకి అనువైన సమయమని సూచించారు.
ప్రధాన పొలాల్లో జీలుగ పచ్చిరొట్ట 20–30 రోజుల దశలో ఉందని, దానిని నేలలో కలియదున్నే ముందు ఎకరాకు 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లితే పచ్చిరొట్ట త్వరగా కుళ్లిపోయి నేల సారాన్ని పెంచుతుందని తెలిపారు.
సాగునీటి వసతి లేని రైతులు తక్కువ నీటి అవసరమయ్యే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.జూలై 15 వరకు పత్తి విత్తేందుకు అవకాశం ఉందని, పత్తిని ఏక పంటగా కాకుండా కంది ని అంతర పంటగా సాగు చేయాలని పేర్కొన్నారు.
ఆత్మనిర్భర్ మిషన్ కింద మినుము, కంది విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గల రైతులు సంబంధిత వ్యవసాయ అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకుని విత్తనాలు పొందవచ్చన్నారు.
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న
BPT – 5204, RNR-15048, WGL-44, KNM-7715, KNM-1638, జై శ్రీరామ్,
HMT వరి రకాలను సాగు చేస్తున్న రైతులు, తాము విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ల ద్వారా సాగు వివరాలను వ్యవసాయ శాఖకు నమోదు చేయాలని సూచించారు. ఏడు రకాల వరి సాగు చేసే రైతు వివరాలు ఆన్ లైన్ నమోదు చేసుకొన్న వారికి మాత్రమే బోనస్ కు అర్హత లభిస్తుందని, రైతులు గమనించాలని కోరారు.
యూరియా అవసరానికి రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ), ఎరువుల డీలర్ లేదా సహకార సంఘాన్ని సంప్రదించాలని అధికారులు తెలిపారు.
అలాగే రాబోయే మూడు రోజుల్లో జిల్లాలో 15 – 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున, రైతులు సాగు చేస్తున్న పంటల్లో నీటి పారుదల, వాన నీటి సంరక్షణ, ఎరువుల వినియోగం తదితర అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది.



