నవతెలంగాణ-హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ విచారణ ముగిసింది. బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం తుది విచారణను ముగించారు. సుప్రీ కోర్టు విధించిన గడువు నేటితో ముగియనుండటంతో, స్పీకర్ వెలువరించబోయే తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
ప్రధానంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లపై దాఖలైన పిటిషన్లపై నేడు స్పీకర్ ఛాంబర్ లో కీలక విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో పది మంది ఎమ్మెల్యేలను ప్రశ్నించారు స్పీకర్, అనంతరం 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. దానం, కడియం కేసులో తీర్పు రిజర్వ్ ఉంచారు. ఉభయ పక్షాల వాదనలు విన్న అనంతరం ఈ కేసులో కూడా విచారణ ముగిసినట్లు స్పీకర్ కార్యాలయం ప్రకటించింది.



