న్యూఢిల్లీ : అయోధ్య రామ మందిరం విరాళాల కుంభకోణంపై దాఖలైన పిటిషన్లను ఈ నెల 13 నుంచి సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి జాబితా చేశారు. ఈ విరాళాల కుంభకోణానికి సంబంధించి వేర్వరు పిటిషన్లు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు దాఖలైన సంగతి తెలిసిందే. అయితే వీటిని అత్యవసర విచారణకు స్వీకరించడానికి వెకేషన్ బెంచ్ నిరాకరించింది. వేసవి సెలవులు తరువాత ఈ నెల 13 సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనం వీటిని విచారించనుంది. విరాళాల కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని, ఎలక్ట్రానిక్ సాక్ష్యాల పరిరక్షణ కోరుతూ వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటితో పాటు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు వచ్చిన విదేశీ విరాళాలతో సహా పూర్తి ఆర్థిక వివరాలను బహిరంగ పర్చాలని కోరుతూ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి) ఎంపి సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను కూడా సోమవారం విచారణకు జాబితా చేశారు. ట్రస్ట్ ప్రారంభమైనప్పటి నుండి దానికి అందిన నగదు, బ్యాంకు బదిలీలు, డిజిటల్ చెల్లింపులు, విదేశీ విరాళాలు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువుల యొక్క పూర్తి వివరాలను, వాటి అకౌంటింగ్, సంరక్షణ, వినియోగ వివరాలతో సహా సమర్పించాలని ట్రస్ట్ను ఆదేశించాలని ఎంపి సింగ్ తన పిటిషన్లో కోరారు. అలాగే, సుప్రీం కోర్టు న్యాయవాది ఎన్.కె. గోస్వామి తాను దాఖలు చేసిన పిటిషన్ సిసిటివి పుటేజ్ వంటి ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను పరిరక్షించాలని కోరింది. న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్లు సంయుక్తంగా దాఖలు చేసిన మరొక పిటిషన్లో ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించే విధంగా ఆదేశించాలని లేదా వివిధ విభాగాలతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని సుప్రీంకోర్టును కోరారు. అయోధ్యలో రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాలు, వస్తువులు మాయం కావడం దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.


