– హాజరైన ఎమ్మెల్యే జారె, ఛైర్పర్సన్ శశికళ లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గర్భాశయ క్యాన్సర్ నివారణ పధకంలో భాగంగా 14 నుండి 15 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న బాలికలకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వేసే హెచ్ పీవీ (హ్యూమన్ పాపిలో వైరస్) వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నియోజకవర్గం కేంద్రం అశ్వారావుపేట లోని ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం ఛైర్పర్సన్ శశికళ, వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు లతో కలిసి లాంచనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బాలికలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా హెచ్పీవీ టీకాలు వేయించుకోవాలని సూచించారు. గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధిని నివారించడంలో ఈ టీకా ఎంతో ఉపయోగకరమని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు.ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
మహిళల్లో ఎక్కువగా కనిపించే గర్భాశయ క్యాన్సర్ వ్యాధిని ముందుగానే నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ హెచ్పీవీ టీకాను ఉచితంగా అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు,ఏహెచ్ వైద్యులు డాక్టర్ మౌనిక,సీహెచ్ఓ అమరావతి,హెచ్వి దుర్గ, హెచ్ఏలు గోపాల్, ప్రసాద్, సతీష్,ఆశా వర్కర్లు,ఏఎన్ఎం లు,కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



