Sunday, June 1, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుటెన్షన్‌..టెన్షన్‌…

టెన్షన్‌..టెన్షన్‌…

- Advertisement -

– నేడు ఖర్గేతో సీఎం, టీపీసీసీ చీఫ్‌ భేటీ
– నూతన కార్యవర్గంపై చర్చ
– నేడో, రేపో ప్రకటన
– మంత్రులతో సీఎం మంతనాలు పూర్తి
– ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఆశావహులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కాంగ్రెస్‌ క్యాడర్‌లో విపరీతమైన టెన్షన్‌ నెలకొన్నది. టీపీసీసీ నూతన కార్యవర్గానికి సంబంధించిన ప్రకటన శుక్ర, శనివారాల్లో రాబోతున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. కొత్త కార్యవర్గంపై సీఎం రేవంత్‌, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ ఇప్పటికే అధిష్టానంతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయినా అవి కొల్కికి రాలేదు.అందుకే మరోసారి ఢిల్లీకి రావాలని అధిష్టానం వారిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు భేటీ కానున్నారు. కాగా బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన నివాసంలో మంత్రులకు విందు ఇచ్చిన సంగతి విదితమే. ఆ సందర్భంగా నూతన కార్యవర్గంతోపాటు క్యాబినెట్‌లో మిగిలిన ఆరు బెర్తుల భర్తీపై వారు చర్చించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ, అది లీకు కావడం…తదితరాంశాలపై కూడా సీఎం ఆరా తీసినట్టు తెలిసింది. వీటితోపాటు ఇప్పటికే తయారైన కాంగ్రెస్‌ నూతన కార్యవర్గం జాబితాకు పీసీసీ చీఫ్‌తో కలిసి సీఎం తుది మెరుగులు దిద్దారు. ఆ జాబితాను శుక్రవారం ఖర్గే ముందు పెట్టనున్నారు. అనంతరం కొత్త కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఆశలెన్నో…
కొత్త కార్యవర్గ జాబితాలో తమ పేరు ఉంటుందా? లేదా? ఇలాంటి ఎన్నో సంశయాలు, సందేహాలతో నేతలు గాంధీభవన్‌లో చర్కర్లు కొడుతున్నారు. మరికొందరు తమకు అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. కొంత మంది నాయకులు మాత్రం తమకు సీఎం, మంత్రులు, సీనియర్ల అండదండలున్నాయనీ, అందువల్ల ఈసారి గ్యారంటీగా పదవి దక్కుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 17 నెలలు పూర్తయింది. అయితే అది ఏర్పడే నాటికి టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్‌రెడ్డే ఉన్నారు. అనంతరం దేశవ్యాప్తంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల మార్పులో భాగంగా తెలంగాణలో కూడా పీసీసీ మార్పు జరిగింది. సీఎంగా రెడ్డి సామాజిక తరగతి నుంచి రేవంత్‌రెడ్డి కొనసాగుతున్న క్రమంలో టీపీసీసీ అధ్యక్షులుగా బీసీ సామాజిక తరగతికి చెందిన మహేష్‌ కుమార్‌గౌడ్‌కు అవకాశం దక్కింది. ఆయన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి కూడా ఎనిమిది నెలలు పూర్తవుతున్నది. మహేశ్‌ బాధ్యతలు తీసుకున్న సమయంలో ఏఐసీసీ నుంచి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా దీపాదాస్‌ మున్షీ ఉన్నారు. జనవరిలో పీసీసీ కార్యవర్గం జాబితా వస్తుందని భావిస్తుండగా… రాష్ట్రానికి కొత్త ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌ వచ్చారు.

మొదటికొచ్చిన కథ…
అప్పటికే చర్చించిన నూతన కార్యవర్గంపై పున:సమీక్షించాలంటూ మీనాక్షి నటరాజన్‌ టీపీసీసీకి సూచించారు. దీంతో ఆ జాబితాపై మరోసారి కసరత్తు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నూతన కార్యవర్గ ప్రకటన ఆలస్యమవుతుందంటూ తన క్యాడర్‌కు కాంగ్రెస్‌ స్పష్టతనిచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు తుది జాబితా సిద్ధమైనట్టు సమాచారం. దానిపై రాహుల్‌ గాంధీ, ఖర్గేతో చర్చించిన తర్వాత టీపీసీసీ కార్యవర్గ కూర్పు ఫైనల్‌ కానుంది. ఈసారి జాబితాలో ఐదారుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు, 20 నుంచి 35 మంది ఉపాధ్యక్షులు, 40 నుంచి 60 మంది ప్రధాన కార్యదర్శులు, సుమారు 30 మంది సెక్రటరీల పోస్టులు, వాటికి నియమించబోయే వారి పేర్లు ఉండబోతున్నట్టు తెలిసింది. కాగా ఇప్పటి దాకా ప్రభుత్వంలో అవకాశం రాని వారికి పార్టీ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అయితే నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న వారిని టీపీసీసీ కార్యవర్గంలోకి తీసుకోవద్దని నిర్ణయించారు. ఒకవేళ కార్యవర్గంలోకి రావాలనుకుంటే కచ్చితంగా నామినేటెడ్‌ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందనే నిబంధన విధించినట్టు సమాచారం. 2017 నుంచి పార్టీలో ఉన్న వారికి, పార్టీ కోసం క్రియాశీలకంగా పని చేసిన వారికి, భవిష్యత్తులో పార్టీ కోసం మరింత కష్టపడే వారికి అవకాశం ఇవ్వబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదే సమయంలో సామాజిక సమీకరణాల ఆధారంగా నూతన కార్యవర్గ కూర్పు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -