Thursday, March 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికుల సమస్యలు అసెంబ్లీలో చర్చించాలి

కార్మికుల సమస్యలు అసెంబ్లీలో చర్చించాలి

- Advertisement -

– రాష్ట్ర ప్రభుత్వానికి సీఐటీయూ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని కార్మికుల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ (సీఐటీయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్‌ కోడ్లను అమలు చేయబోమని తీర్మానం చేయాలని కోరింది. రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సమావేశాల సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ మీడియాకు వెల్లడించారు. కేరళ రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వం ఇప్పటికే తీర్మానం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 73 షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్స్‌ కనీస వేతనాలు సవరించకుండా కాలయాపన చేయడం వల్ల దాదాపు కోటి మంది కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 జనవరిలో డ్రాఫ్ట్‌ను పెండింగ్‌లో పెట్టిందని గుర్తు చేశారు. హైకోర్ట్‌ ఉత్తర్వులను సైతం అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం కొనసాగించాలన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, మిషన్‌ భగీరథ తదితర ఉద్యోగులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలన్నారు. గ్రామ పంచాయితీ కార్మికులకు ప్రభుత్వమే బడ్జెట్‌ కేటాయించి వేతనాలు ఇవ్వాలన్నారు. మున్సిపల్‌ కార్మికులకు కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 3,797 వీఆర్‌ఎల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలనీ, భవన నిర్మాణ కార్మికులకు సీఎస్సీ హెల్త్‌ టెస్టులను రద్దు చేయాలనీ, వెల్ఫేర్‌ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఇచ్చిన అనుమతి ఉపసంహరించుకోవాలనీ, సహజ మరణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. హమాలీలు, ప్రయివేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్లకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని 7 లక్షల మంది బీడీ కార్మికుల వేతనం పెంచడంతో పాటు వెల్ఫేర్‌ బోర్డు స్కీంలు అమలు చేయాలన్నారు. సింగరేణి కార్మికులకు స్వంత ఇంటి కల నెరవేర్చడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు రూ.42,000 కోట్లు వెంటనే చెల్లించాలన్నారు. విద్యుత్‌ రంగంలో ఆర్టిజెన్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీలో ప్రయివేట్‌ బస్సులను రద్దు చెయ్యడంతో పాటు ప్రభుత్వమే ఆర్టీసీని నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -