నవతెలంగాణ-వెంకటాపూర్
సీపీఐ(మావోయిస్టు) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సుమారు 45 ఏండ్ల తర్వాత బుధవారం తన సొంత గ్రామం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామానికి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. గ్రామానికి చేరుకున్న ఆయన్ను చూసేందుకు గ్రామస్తులు, బాల్యమిత్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దశాబ్దాల తర్వాత ఆత్మీయులను కలుసుకోవడంతో ఆశన్న ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వంతోనే మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని పీపుల్స్ వార్ పార్టీ ప్రారంభించిందని గుర్తు చేశారు.
వరంగల్ డిక్లరేషన్తో మొదలైన ఈ ప్రయాణం రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి ఊపిరి పోసిందన్నారు. తన రాజకీయ ప్రస్థానం గురించి వివరిస్తూ.. చిన్నతనంలో చూసిన అగ్రకులాల ఆధిపత్యం, భూస్వామ్య వ్యవస్థ, పల్లెల్లోని పేదరికం తనను ఆలోచింపజేశాయని, తండ్రి భిక్షపతి రావు నేర్పిన ప్రశ్నించేతత్వమే తనను ఉద్యమం వైపు నడిపించిందని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలను చైతన్యపరుస్తూ, సమాజ మార్పు కోసం తన శక్తి మేరకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జల వనరుల సంస్థ చైర్మెన్ వీరమల్ల ప్రకాశ్రావు, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ ఎర్రబెల్లి గోపాల్ రావు, గ్రామ పెద్దలు సూర్యనేని మురళీధర్ రావు, తౌట్ రెడ్డి మల్లారెడ్డి, భాస్కరరావు, ఎర్రబెల్లి సుధాకర్ రావు, గొర్రె ఓదెలు, అల్లం ఓదెలు యాదవ్, కొమురయ్య, రేపాల సత్యనారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.
సొంత గ్రామానికి మాజీ మావోయిస్టు నేత ఆశన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



