నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం గంగారం గ్రామపంచాయతీలో గ్రామంలో ఎక్కువగా చెత్త ఉత్పత్తి చేస్తున్న వ్యాపారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. గ్రామంలో పరిశుభ్రతను కాపాడడం, చెత్తను సరైన విధంగా నిర్వహించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి అంశాలపై గ్రామపంచాయతీ అధికారులు వ్యాపారులకు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వ్యాపారులు తమ దుకాణాల వద్ద చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త బుట్టల్లో వేయాలని, తడి-పొడి చెత్తను వేరుగా సేకరించాలని సూచించారు. అలాగే గ్రామంలో స్వచ్ఛతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. చెత్తను సక్రమంగా నిర్వహించడం ద్వారా గ్రామంలో వ్యాధులు రాకుండా నివారించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామపంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామంలోని పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని అధికారులు కోరారు.



