సుప్రీంలో ముగిసిన వాదనలు
తీర్పు నోటిఫై చేయండి
నాలుగు రోజుల్లో పత్రాలు పిటిషనర్లకు అందజేయాలని ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలని, స్పీకర్పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణను ముగించింది. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నందున ఇకపై ఈ వ్యవహారంలో తదుపరి విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే స్పీకర్ తీర్పు కాపీని శుక్రవారం ముగిసే లోపు అప్లోడ్ చేయాలని, నాలుగు రోజుల్లో ప్రతివాదులకు సంబంధిత పత్రాలు అందజేయాలని ఆదేశించింది.
ఈ వ్యవహారంలో గతంలో సీజేఐ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిల కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేయగా, ప్రభుత్వం మరింత సమయం కావాలని ఆశ్రయించింది. ఈ నాలుగు పిటిషన్లను గురువారం జసిస్ట్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్తీన్ జార్జ్ మాసిహ్ ల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. తెలంగాణ స్పీకర్ కార్యాలయం, అసెంబ్లీ సెక్రెటరీ తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, నిరంజన్ రెడ్డిలు, ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గిలు హాజరయ్యారు.
తదుపరి విచారణ అవసరం లేదు
తొలుత అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తూ… 10 ఎమ్మెల్యేలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టిన స్పీకర్ తాజాగా నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు నివేదించారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాత విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే స్పీకర్ ఉత్తర్వు కాపీలను ఇంకా పిటిషనర్లకు అందలేదని బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ కార్యాలయం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేయాలని చూస్తోందని ఆరోపించారు.
టైం బాండ్ తో తమకు స్పీకర్ తీర్పు కాపీలను అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరువైపు వాదనలను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం… ఇకపై కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ విచారణను ముగించింది. అలాగే ఈరోజు లోపు అధికారిక సైట్ లో స్పీకర్ తీర్పును అప్లోడ్ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా చట్టానికి లోబడి పిటిషనర్లకు నాలుగు రోజుల్లో సంబంధింత పత్రాలు అందజేయాలని ఆదేశిస్తూ… ఐదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.



