– మున్సిపల్ చైర్ పర్సన్ రెహానా కమల్, కమిషనర్ నరసింహ
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణాన్ని ‘క్లీన్ అండ్ గ్రీన్’గా, ఆదర్శవంతంగా, తీర్చిదిద్దడమే ధ్యేయంగా అధికారులు, సిబ్బంది కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని మున్సిపల్ చైర్పర్సన్ రెహానా కమల్, కమిషనర్ కోండ్ర నరసింహ మున్సిపల్ కార్యాలయంలోని అన్ని విభాగాల అధికారులు సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ రెహానా కమల్ అధ్యక్షతన పట్టణ ప్రగతి, ప్రజారోగ్యం, అభివృద్ధి పనులపై అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్ పర్సన్, కమిషనర్ మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లించే ప్రక్రియను ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు.
ఇంకుడు గుంతలు, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలి
‘క్యాచ్ ద రెయిన్’ కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల పెంపునకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతల ఏర్పాటు చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటి సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఎల్ఆర్ఎస్ పై విస్తృత ప్రచారం జరగాలి
మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక ప్లాట్లు, లేఅవుట్లను క్రమబద్ధీకరించడానికి లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) పై ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ ప్రస్తుతం 25 శాతమే ఉన్నందున, అన్ని వార్డులలో మైకుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను చైర్ పర్సన్, కమిషనర్ ఆదేశించారు. పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులలో ఇంజనీరింగ్ విభాగం కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ప్రజలకు మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని, పైప్లైన్ లీకేజీలు ఉంటే తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ మైసా శ్రీనివాసరావు, ఏఈ సురేష్, టీపీబీఓ కిరణ్, ఆర్ఐ కె. దిలీప్ కుమార్, సీనియర్ అకౌంటెంట్ వై. సుజాత, మెప్మా సీఓ రావి ప్రసాద్లతో పాటు అన్ని విభాగాల అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



