కొన్ని శతాబ్దాల క్రితమే మన విష్ణుశర్మ పంచతంత్ర కథలు చెప్పాడు. అందులో మిత్రలాభం, మిత్రభేదం అనేవి మొదటి రెండు. వీటిల్లో అనేక ఉపకథలు, ఒకదానికొకటి లింకవుతూ సాగుతాయి. పిల్లలందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటికీ పంచతంత్ర కథలు చాలా ఆసక్తిగా చదివిస్తాయి. అందులో పక్షులు, జంతువులు పాత్రదారులుగా ఉన్నా, మనుషులకు వర్తించే నీతిని, ధర్మాలను, నిజాయితీలను వర్ణిస్తూ సాగుతాయి. మిత్రభేదం మొదటికథలో అడవిరాజు సింహం, ఒక పెంపుడు ఎద్దు మధ్య అసహజ స్నేహాన్ని విచ్ఛిన్నం చేయడం ఈ తంత్రం యెక్క ఇతివృత్తం. ఎద్దుతో స్నేహం కారణంగా రాజు తన ప్రజల పట్ల తన బాధ్యతలను మరచిపోయినప్పుడు, అతని మంత్రి, ఒక నక్క, ఆ స్నేహాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక పథకం వేస్తుంది.
ఇకపోతే, మిత్రలాభంలో కూడా చాలా కథలున్నాయి. కథ చెప్తూ విష్ణుశర్మ ఇలా అంటాడు. ‘సామాన్యుడు కానీ, రాజ్యాధికారి కానీ, తమ జీవిత కాలంలో మంచి మిత్రులను సంపాదించుకోవాలి. ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు’ అని కథలో వివరిస్తాడు. నేను కథలు వివరించను గానీ, లఘుపతనకుడనే కాకి, హిరణ్యకుడు ”శత్రువులతో మైత్రి ప్రమాదకరం. కాగిన నీళ్లయినా అగ్నిని ఆర్పేస్తాయి. వైరం రెండు విధాలు. పుట్టుకతో వచ్చేది సహజవైరం. ఏదో సరిపడక వచ్చేది మామూలు వైరం. కుక్కా పిల్లి కలిసి ఉండగలవా? నీటికి నిప్పుకీ మధ్య నేస్తం కుదురుతుందా? నేను నీ ఆహారాన్ని, నువ్వు నన్ను తినేదానివి. నీకూ నాకూ స్నేహం కుదరదు” అని స్పష్టంగా చెప్పేస్తుంది ఎలుక.
ఇప్పుడీ పంచతంత్ర కథల ప్రస్తావనెందుకంటే, శతాబ్దాల క్రితం చేసిన ఆలోచనలను ఇప్పుడు మన పాలకులు చేయకపోవటం, ఎంత బుద్ధిహీనత! హిరణ్యకుడి ద్వారా విష్ణుశర్మ మనకేం చెప్పాడు. ఎవరు మనకు నిజమైన మిత్రులు, ఎవరు శత్రువులు, అనే విచక్షణ ఉండాలని కదా! చెప్పింది. మరి మన నేటి పాలకులకు ఆ వివేచన ఉందా? మొత్తం ప్రపంచాన్ని, ప్రపంచ దేశాల వనరులను కాజేయడానికి, దేశాలపై దాడులు చేస్తూ విధ్వంసాన్ని, యుద్ధాన్ని సృష్టిస్తున్న సామ్రాజ్యవాద అమెరికాను మిత్రుడుగా భావించడం, దానితో మితృత్వాన్ని నెరపడం కొరవితో తలగోక్కోవడం కాదా! అమెరికాతో అంటకాగుతూ యుద్ధ చిచ్చును రగిల్చిన ఇజ్రాయిల్ దేశం మనకెట్లా స్నేహితుడవుతాడు! కొన్ని తరాలుగా,చారిత్రకంగా భౌగోళికంగా మన భారతదేశానికి మిత్రునిగా ఉన్నాడు.
సంస్కృతి సంప్రదాయాల కలబోతలు, ఆదాన ప్రదానాలు కలిగిన సంబంధాన్ని శత్రుసంబంధంగా మార్చే నీతిబహ్య చర్యలు, దేశ ప్రజల ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగపడవు. అంతేకాదు హీనచరితగా మిగిలిపోతుంది. వెనిజులాపైన అమెరికా దాడిచేసి, మదురో దంపతులను అంతర్జాతీయ న్యాయసూత్రాలనన్నింటినీ అతిక్రమించి ఎత్తుకుపోతే మన దేశ పాలకుడు మోడీ ఏమీ మాట్లాడలేదు. శాంతికోసం ఆలింగనం చేసుకునివచ్చిన మరుక్షణంలో ఇజ్రాయిల్ నెతన్యాహు ఇరాన్పై బాంబులు వేస్తే ఒక్కమాటా మాట్లాడలేదు. వందలాది మందిని చంపుతున్నా, ఆఖరికి ఇరాన్ దేశాధినేతను చంపినా కిమ్మనలేదు.
అనేక సంవత్సరాలుగా రష్యా మనదేశానికి చౌకగా చమురు సరఫరా చేస్తుంటే, అమెరికా ఆదేశించిందని మానేసి, అమెరికా ఎక్కువ ధరకు ఇస్తున్న చమురును కొనటం ఎంత దిగజారుడుతనం. ఇప్పుడేమయింది! ఇదివరకెన్నడూ లేని కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నామని మంత్రి హర్దీప్సింగ్పురి పార్లమెంటులో ప్రకటించాడు. గ్యాస్బండ ధరలు పెరుగుతున్నాయి. అసలు గ్యాసు దొరకక చిన్న చిన్న వ్యాపారాలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఐటీ ఉద్యోగులకు క్యాంటీన్లు లేకుండా పోయాయి. రోడ్డుపక్క మిర్చిబజ్జీల బండ్లు మూసేశారు. ఆర్డర్లు లేక స్విగ్గీ, జొమాటోలో ఉపాధి పొందుతున్నవారు రోడ్ల పాలవుతున్నారు. వాణిజ్య సిలిండర్ల కొరత దేశం మొత్తం పెరిగింది.
నెతన్యాహు, ట్రంప్ మిత్రులను అడుగుతాడా సహాయం! ఇట్లాంటి యుద్ధ సమయంలో కూడా ఇంత లొంగుబాటును ప్రదర్శించినప్పటికీ, భారత్పై సుంకాలు పెంచుతామని అమెరికా ప్రకటిస్తున్నది. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. చమురు నౌకలను కదలకుండా ఆపేసింది. మిత్ర దేశాలకు మాత్రం సరఫరాకు వీలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. నిన్ననే ఒక చమురు నౌక మన తీరానికి చేరుకున్నట్లు ప్రకటించారు. ఇప్పటికి కూడా మన దేశానికి ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు? తెలుసుకోకపోతే నష్టపోయేది ప్రజలు. తెలిసీ ఉన్మాదుల పక్కన చేరితే, ప్రజలు ఊరుకోరు. కొంత ఆలస్యంగానైనా మీ అసలు రూపాన్ని తెలుసుకుంటారు. ఎందుకంటే, ప్రజలు పంచతంత్ర కథలన్నీ చదువుకొని ఉన్నారు.
అకాలజ్ఞత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



