నవతెలంగాణ-సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణంలోని బస్టాండ్ రింగ్ సెంటర్ ఎదురుగా ఉన్న అయ్యగారిపేట ప్రధాన రహదారిలోని (శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం రోడ్డు) బీసీ బాలుర హాస్టల్ను కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ మంగళవారం సందర్శించారు.
ఈ సందర్భంగా హాస్టల్లోని భోజన గది, విద్యార్థుల గదులు, బాత్రూంలు, క్రీడా ప్రాంగణాన్ని ఆయన సమగ్రంగా పరిశీలించారు. హాస్టల్ భవన పరిస్థితులను, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం అందించాలని ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమ అధికారిని కోరారు. హాస్టల్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత పాల్గొన్నారు. కౌన్సిలర్లు గ్రాండ్ మౌలాలి, విరివాడ అపర్ణ, శరత్ చంద్ర, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నారావు, మొహమ్మద్ కమల్ పాషా పాల్గొన్నారు.



