తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో జనగామ తాలూకా ధర్మాపురం ఒక విప్లవ కేంద్రం. ఇక్కడ ప్రతి గడ్డి పోచా ఆయుధమే. ప్రతి తండా ఒక కధనరంగమే.1944 నుండి 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం దొరల ఆగడాలపై ధిక్కారం. ధర్మపురం, దేవరుప్పుల, మొండ్రాయి గ్రామాల్లో దొరల ఆకృత్యాలకు లంబాడీ తండాలే నిలయాలు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారి భూములను లాక్కోవడం, స్త్రీలపై ఆకృత్యాలు చేయడం నిత్యకృత్యంగా ఉండేది.
అక్కడ నివసించే జాటోత్ హానుమూ నాయక్ కుమారులు ఆరుగురు కోడ్యా, సోమా, సంకు, ఠానూ, ధర్మ, కిషన్ దొరల ఆగడాలపై తిరగబడ్డారు. విసునూరు దేశ్ముఖ్ రాంచంద్రా రెడ్డి, ఉసుకూరు రాఘవరావుల భూ ఆక్రమణలను ఎదిరించారు. తమ ఎనభై ఎకరాల మెట్ట, 25 ఎకరాల మాగాణి భూములను కాపాడుకోవడానికి ఆయుధం పట్టారు. వీరు కేవలం తమ భూమి కోసమే కాకుండా, తండాలోని ఇతర గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రాణాలకు తెగించి నిలబడ్డారు.
1946 జూలై 4న కడివెండిలో దొడ్డి కొమురయ్య అమరుడైన వార్త విన్న ఠానూనాయక్ హృదయం రగిలింది. ఆ ఆవేశం ధర్మాపురం తండాను యుద్ధరంగంగా మార్చింది. దొడ్డి కొమురయ్య నేలకొరిగిన చేతుల నుండి జారిన ఎర్రజెండా అందుకున్నాడు. మూడు వందల మంది నిజాం మిలిటరీతో సాగిన సాయుధ యుద్ధం తుపాకులు, ఫిరంగులున్న సైన్యాన్ని చూసి గిరిజన బిడ్డలు బెదరలేదు, చెదరలేదు. ఠానూనాయక్ నాయకత్వంలో కేవలం వడిసెల రాళ్లతో భీకర పోరాటం చేశారు. శత్రువును అడుగు ముందుకు వేయనివ్వకుండా, వడిసెల రాళ్లతోనే వారిని వెనక్కి తరిమికొట్టారు.
ఠానూ చూపిన తెగువ, తండా బిడ్డలకు ఇచ్చిన ధైర్యం, తన వ్యూహరచన గిరిజన పోరాట చరిత్రలో మైలురాయి. ఠానూ నాయక్ కుటుంబం మొత్తం విప్లవానికే జీవితాలను ఆర్పించారు. ఠానూ తమ్ముడు సంకునాయక్ను చిత్రహింసలు పెట్టి చంపేశారు.మరో తమ్ముడు కిషన్నాయక్ కేవలం పద్దెనిమేళ్ల వయసులో జైలు పాలయ్యాడు.పెద్దన్న జోడ్యానాయక్ను పోలీసులు బంధించి చిత్రహింసలకు పెట్టారు. వారి ఇళ్లను రెండుసార్లు తగులబెట్టినా, ఆస్తులను కొల్లగొట్టినా ఆ కుటుంబం ఏనాడూ ధైర్యం కోల్పోలేదు. భారత సైన్యం హైదరాబాద్లో ప్రవేశించిన కాలంలో కూడా ఆయన గెరిల్లా పోరాటాన్ని కొనసాగించారు.
ఠానూ నాయక్ను నేరుగా పట్టుకోవడం సాధ్యం కాలేదు. కానీ, చివరకు ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం వల్ల మొండ్రాయి గ్రామంలో ఆయన శత్రువులకు చిక్కగా చిత్రహింసలు పెట్టారు. అయినప్పటికీ ఠానూ బెదరలేదు. ఆ మొండితనం, ఆ ధైర్యం చూసి సైన్యాధికారులు సైతం ఆశ్చర్యపోయారు. కటారు నరసింగరావు అనే దేశ్ముఖ్ ఠానూనాయక్ను బండికి కట్టి, శరీరం ముక్కలైపోయే వరకు ఈడ్పించి చంపాడు. మూడవందల మంది మిలిటరీ చుట్టుముట్టినా మూడు గంటలు వణికించిన మొండ్రాయి మొనగాడు ఠానునాయక్.
చావుకు వెనకడుగు వేయని తండా యోధుడతడు. శత్రువు తుపాకీ గురిపెట్టినా, ప్రాణాలు పోతున్నా ఆయన పెదవులపై నినదించిన మాటలు ”కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి.. ఎర్రజెండా వర్ధిల్లాలి, శత్రువు అంతం కావాలి!”. 1950 మార్చి 20వ తేదీన ఠానూనాయక్ వీరమరణం పొందాడు. అధికార బలమున్నా, వారి వద్ద అయుధాలున్నా సామాన్య గిరిజనులు ఐక్యంగా ఎవరినైనా ఓడించవచ్చని ఆయన నిరూపించాడు. తండా ప్రజల కన్నీళ్లు తుడవడానికి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించాడు. ఆయన సాహసం, ధైర్యం, త్యాగం, భావితరాలకు ఆదర్శం.
-భూపతి వెంకటేశ్వర్లు, 9490098343
తండా యోధుడు ఠానూనాయక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


