– సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా జిల్లా నాయకులు సారా సురేష్
నవతెలంగాణ–కమ్మర్ పల్లి
ప్రభుత్వాలు ఎన్ని మారినా పేద ప్రజల బతుకులు మారడం లేదని, వ్యవసాయ కూలీలు కూలీలు గానే ఉంటున్నారని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా నిజామాబాద్ రూరల్, కామారెడ్డి జిల్లా నాయకులు సారా సురేష్ అన్నారు. మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) తెలంగాణ రాష్ట్ర మహాసభల గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఈనెల 24, 25 తేదీలలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మహాసభలకు వామపక్ష, విద్యార్థి యువజన సంఘాల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా పేద ప్రజల బతుకులు మారడం లేదన్నారు. వ్యవసాయ కూలీలు కూలీలు గానే ఉంటున్నారని, భూసంస్కరణ చట్టాలు ఎన్ని తీసుకువచ్చిన ఫలితం లేకుండా పోయిందన్నారు. 40 కోట్ల ఎకరాల భూమిలో 75 వేల మిగులు భూమి ఉన్నట్టు ప్రకటనలు చేసి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నయే కానీ పేద ప్రజలకు సెంటు భూమి దక్కడం లేదన్నట్లు. ఇంకా లక్షల ఎకరాల భూములు మిగులు ఉన్నాయని, పేదలకు భూ పంపిణీ జరగాలంటే పోరాటమే ఏకైక మార్గమని పేర్కొన్నారు. పేద ప్రజలందరూ పోరాటానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ది రాజేశ్వర్, నిరేష్, సాయిలు, గౌరీ, తదితరులు పాల్గొన్నారు.



