Tuesday, July 28, 2026
E-PAPER
Homeబీజినెస్న్యూజిలాండ్‌కు చారిత్రాత్మక ఎగుమతితో ప్రపంచ మార్కెట్లకు తీసుకువెళ్తున్న 'ఆహార'

న్యూజిలాండ్‌కు చారిత్రాత్మక ఎగుమతితో ప్రపంచ మార్కెట్లకు తీసుకువెళ్తున్న ‘ఆహార’

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇన్‌ఫిని అగ్రోటెక్‌ LLPకు చెందిన వినియోగదారుల బ్రాండ్‌ ‘ఆహార’ (Aaahara), వృక్షసంబంధమైన పదార్థాలతో రూపొందించిన, ప్రిజర్వేటివ్‌లు లేని, వండుకోవడానికి సిద్ధంగా ఉండే చిరుధాన్యాల ఫంక్షనల్‌ ఫుడ్‌ ఉత్పత్తులను భారతదేశం నుంచి తొలిసారిగా సముద్ర మార్గం ద్వారా న్యూజిలాండ్‌కు విజయవంతంగా ఎగుమతి చేసింది. తద్వారా, భారత విలువ ఆధారిత వ్యవసాయ-ఆహార ఎగుమతుల్లో ఒక కీలక మైలురాయిని నమోదు చేసింది. ఈ చారిత్రాత్మక ఎగుమతికి APEDA కీలక సహకారం అందించింది.

వ్యవసాయ & ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (APEDA) సహకారంతో సాధించిన ఈ మైలురాయి వినూత్నమైన, విలువ ఆధారిత భారతీయ ఆహార ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకువెళ్లడంలో ఒక ముఖ్యమైన ముందడుగు. అదే సమయంలో ఇది విలువ గొలుసులోని చిరుధాన్యాల రైతులు, ఆహార ప్రాసెసర్లు మరియు ఎగుమతిదారులందరికీ కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.

ఈ విజయవంతమైన ఎగుమతి, ‘ఆహార’ సంస్థ అంతర్జాతీయ విస్తరణలో ఇప్పటికే సాధించిన పురోగతికి కొనసాగింపుగా నిలిచింది. గౌరవనీయ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నేతృత్వంలో న్యూజిలాండ్‌కు వెళ్లిన భారత వ్యాపార ప్రతినిధి బృందంలో ఈ సంస్థ పాల్గొంది. అక్కడ, CEO సురేష్ బాఫ్నా, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడం మరియు వినూత్న భారతీయ ఆహార ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో మరింత స్థానం కల్పించే అవకాశాలను పరిశీలించారు. అదనంగా, APEDA నిర్వహించిన భారతి (BHARATI) కార్యక్రమం ద్వారా, అలాగే వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా 2025, ఇండస్‌ ఫుడ్‌ 2025, గల్ఫుడ్‌ 2026 వంటి అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనల్లో పాల్గొనడం ద్వారా విదేశీ కొనుగోలుదారులతో సంబంధాలను ఏర్పరచుకుని, కొత్త ఎగుమతి అవకాశాలను ‘ఆహార’ సంస్థ పొందగలిగింది.

ఈ సందర్భంగా ఆహార‘ (ఇన్‌ఫిని అగ్రోటెక్‌ LLP) CEO సురేశ్‌ బాఫ్నా మాట్లాడుతూ, మన సాంప్రదాయ ఆహార విజ్ఞానాన్ని పాటిస్తూనే, భారతీయ ఆహార ఆవిష్కరణలు ప్రపంచ మార్కెట్లలో విజయవంతంగా పోటీ పడగలవని ఈ మైలురాయి నిరూపిస్తుంది. APEDA తన ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా మా వంటి భారతీయ సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తెచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆరోగ్యకరమైన, పర్యావరణహిత, ఫంక్షనల్‌ ఫుడ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, రైతులకు మరిన్ని అవకాశాలు కల్పించే, భారత వ్యవసాయ ఎగుమతులను బలోపేతం చేసే, ‘శ్రీ అన్నపోషక ప్రయోజనాలను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు చేరవేసే విలువ ఆధారిత చిరుధాన్యాల ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.” అని అన్నారు.

ఈ ఒక మెట్రిక్‌ టన్ను ఎగుమతి సరుకులో ‘ఆహార’ సంస్థ తయారు చేసిన క్లీన్‌-లేబుల్‌ చిరుధాన్యాల ఫంక్షనల్‌ ఫుడ్స్‌ ఉన్నాయి. వాటిలో మన్‌శాంతి ఖిచిడీ, నిద్ర పాయసం, సూత్ర పొంగల్, రక్షా కంజి, బాలా అడై మరియు మేధా ఇడ్లీ దోస వంటివి ఉన్నాయి. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు మరియు భారతీయ గృహాలలో సాంప్రదాయకంగా ఉపయోగించే వృక్షసంబంధమైన పదార్థాలతో రూపొందించిన ఈ ఉత్పత్తులు పోషకాహారం, సౌలభ్యం, భారతీయ సంప్రదాయ రుచులను ఆధునిక వినియోగదారులకు అందించేలా రూపొందించబడ్డాయి.

ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమాలు, వాణిజ్య సౌలభ్య చర్యలు, మార్కెట్‌ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నిరంతరం మార్గనిర్దేశనం & సహకారం అందించిన APEDAకు ‘ఆహార’ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇవి, సంస్థ తన అంతర్జాతీయ మార్కెట్‌ ఉనికిని విస్తరించడానికి సహాయపడ్డాయి.

ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు పోషకవిలువలు అధికంగా ఉన్న, పర్యావరణహిత, సులభంగా వండుకునే ఆహారాన్ని కోరుకుంటున్న నేపథ్యంలో, ప్రీమియం భారతీయ చిరుధాన్యాల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఆదరణకు ఈ ఎగుమతి నిదర్శనంగా నిలుస్తోంది. సంప్రదాయ భారతీయ వంటకాలను ఆధునిక ఆహార సాంకేతికతతో మేళవించి, అసలైన రుచిని కాపాడుతూ, ప్రిజర్వేటివ్‌లు లేని ఉత్పత్తులను ‘ఆహార’ అభివృద్ధి చేసింది. దీంతో ఆధునిక జీవనశైలికి అనుగుణమైన ఆహార పరిష్కారాలను అందించడంతో పాటు, ‘శ్రీ అన్న’ను పోషక విలువలు అధికంగా ఉన్న, సుస్థిరమైన ఆహార ధాన్యంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేస్తోంది.

భారతదేశం యొక్క గొప్ప వంటల వారసత్వాన్ని ఆవిష్కరణల ద్వారా పరిరక్షించాలనే లక్ష్యంతో స్థాపించబడిన ‘ఆహార’ సంస్థ, సంప్రదాయ భారతీయ వంటకాల స్ఫూర్తితో క్లీన్‌-లేబుల్‌ ఆహార ఉత్పత్తులను అభివృద్ధి చేస్తోంది. సంస్థ ప్రధాన ఉత్పత్తి శ్రేణి ‘ఆహార ఆరోగ్య’ (Aaahara Arogya) చిరుధాన్యాల ఫంక్షనల్‌ ఫుడ్స్‌తో పాటు, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద గ్రైండింగ్‌ చేసే క్రయోజెనిక్‌ ప్రాసెసింగ్‌ సాంకేతికతతో మసాలా దినుసులను కూడా తయారు చేస్తోంది. ఈ సాంకేతికత వల్ల సాధారణ ప్రాసెసింగ్‌తో పోలిస్తే మసాలాల సహజ సువాసన, రంగు, రుచి మరింత మెరుగ్గా నిల్వ ఉంటాయి.

ప్రస్తుతం, ‘ఆహార’ సంస్థ దక్షిణ భారతదేశంలో 22,000కు పైగా రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉంది. అలాగే HoReCa (హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌) రంగంతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్‌ & క్విక్‌-కామర్స్‌ వేదికల ద్వారా కూడా తన ఉనికిని విస్తరిస్తోంది. ఈ ఎగుమతి విజయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు)తో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడం, రైతులతో ప్రత్యక్ష అనుసంధానాన్ని పెంపొందించుకోవడం, భారతదేశ వ్యవసాయ బలాలు, ఆహార ఆవిష్కరణ సామర్థ్యాలు, గొప్ప పాకశాస్త్ర వారసత్వాన్ని ప్రపంచ వినియోగదారులకు పరిచయం చేసే మరిన్ని విలువ ఆధారిత వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని ‘ఆహార’ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -