నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ప్రమాదం జరిగింది. అమెజాన్ కార్గో విమానం రన్వేపై నుంచి పక్కకు దూసుకెళ్లి.. సమీపంలోని వాహనాలను ఢీకొంది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.
ప్యూర్టోరికో నుంచి వచ్చిన విమానం మియామి ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతుండగా.. రన్వేపై ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. సమీపంలో ఇతర వ్యాపారాల కోసం ఉపయోగించే రోడ్డుపైకి దూసుకెళ్లి.. అక్కడి వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంతో విమానంలో మంటలు చెలరేగి, ఘటనాస్థలమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పైలట్, కోపైలట్, వాహనాల్లో చిక్కుకుపోయిన వారిని, అలాగే విమానం కింద ఇరుక్కుపోయిన వ్యక్తిని సహాయక సిబ్బంది బయటకు తీశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదురుగు ప్రాణాలు కోల్పోగా.. పలువురిని ఆస్పత్రికి తరలించారు. మృతులు విమానంలోని వారా..? రోడ్డుపై ఉన్న వ్యక్తులా అనే దానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.


