రూ.30వేల కోట్ల ఇష్యూకు సెబీ గ్రీన్ సిగ్నల్
ముంబయి : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) ఐపిఒకు దేశీయ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. దాదాపు దశాబ్ద కాలంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియ కొలిక్కి రావడంతో భారత మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఐపిఒగా నిలవనుంది. సెప్టెంబర్ 15 నుంచి ఈ పబ్లిక్ ఇష్యూ సబ్స్క్రిప్షన్కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా, సెప్టెంబర్ 25 నాటికి ఎన్ఎస్ఇ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) లో లిస్ట్ కానున్నట్లు వర్గాలు వెల్లడించాయి. కోలొకేషన్, డార్క్ ఫైబర్ వివాదాలకు సంబంధించి ఎన్ఎస్ఇ రూ.1,491.21 కోట్ల సెటిల్మెంట్ చెల్లించడంతో సుప్రీంకోర్టు ఇటీవల సెబీ అప్పీళ్లను కొట్టివేయడంతో ఈ చట్టపరమైన అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి.
ఈ ఐపిఒ పూర్తి ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్ఎస్) పద్ధతిలో సాగనుండగా రూ.1 ముఖ విలువ కలిగిన 14.89 కోట్ల ఈక్విటీ షేర్లను (సుమారు 6 శాతం వాటా) విక్రయించనున్నారు. అన్ లిస్టెడ్ మార్కెట్లో ఎక్స్ఛేంజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఈ ఐపిఒ పరిమాణం దాదాపు రూ.30,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా. 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 28,000 కోట్లతో చేపట్టిన ఐపిఒ రికార్డును ఇది అధిగమించనుంది. ఈ ఇష్యూ ద్వారా వచ్చే మొత్తం సొమ్ము ఎక్స్ఛేంజ్కు కాకుండా, వాటాలు విక్రయిస్తున్న షేర్హోల్డర్లకే చెందనుంది.
ఎట్టకేలకు ఎన్ఎస్ఇ ఐపిఒకు ఆమోదం
- Advertisement -
- Advertisement -



