పొదుపుతో పాటు రక్షణకు ‘బీమా ప్లాటినం’
కుటుంబ ఆర్థిక భద్రతకు ‘జీవన్ రక్ష’
ముంబయి : ప్రభుత్వ రంగ దిగ్గజ జీవిత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెండు కొత్త బీమా పాలసీలను విడుదల చేసింది. ఎల్ఐసీ బీమా ప్లాటినం (ప్లాన్ 770), జీవన్ రక్ష (ప్లాన్ 894) పాలసీలను మంగళవారం సంస్థ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. దొరైస్వామి లాంఛనంగా ప్రారంభించారు. ఎల్ఐసీ బీమా ప్లాటినం నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ వ్యక్తిగత పొదుపు రక్షణ పాలసీ. ఇందులో ఏటా చెల్లించే ప్రతి రూ.1,000 ప్రీమియంపై రూ.70 చొప్పున గ్యారెంటీడ్ ఎడిషన్స్ లభిస్తాయి. కనిష్ట బేసిక్ సమ్ అష్యూర్డ్ను రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ప్రీమియం చెల్లింపు కాలపరిమితి ముగిసిన ఐదో సంవత్సరంలో బేసిక్ సమ్ అష్యూర్డ్లో 70 శాతం వరకు బూస్టర్ ఇన్కమ్ బెనిఫిట్ లభించనుంది.
రిస్క్ కవరేజ్కు జీవన్ రక్ష
ఎల్ఐసీ జీవన్ రక్ష ప్యూర్ రిస్క్ ప్లాన్గా రూపొందించారు. పాలసీదారుడు మరణించిన సందర్భంలో పాలసీదారు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ పాలసీలో కనిష్ట సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు కాగా, గరిష్ట పరిమితి రూ.24 లక్షలుగా ఉంది. మహిళలకు ప్రత్యేక ప్రీమియం రేట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రెండు కొత్త పాలసీలలోనూ అదనపు రైడర్ ప్రయోజనాలను ఎంచుకునే అవకాశం ఉందని ఎల్ఐసీ తెలిపింది. సంస్థ 70వ వసంతోత్సవ వేళ విభిన్న వర్గాల బీమా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది.
ఎల్ఐసీ నుంచి రెండు కొత్త పాలసీలు
- Advertisement -
- Advertisement -



