పీఎల్ క్యాపిటల్ హెచ్చరిక
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో భవిష్యత్తులోనూ ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పీఎల్ క్యాపిటల్ తన తాజా నివేదికలో హెచ్చరించింది. ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, ద్రవ్యోల్బణ ముప్పు వంటి అంశాలు మార్కెట్ విస్తృత ర్యాలీకి అడ్డంకిగా మారవచ్చని విశ్లేషించింది. అయితే దీర్ఘకాలిక వృద్ధిపై సానుకూల అంచనాలతో నిఫ్టీ 12 నెలల టార్గెట్ను గతంలో ఉన్న 27,019 నుంచి 27,123 పాయింట్లకు సవరించింది. సమీప కాలంలో మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొనే అవకాశాలున్నందున మదుపర్లు ఆచితూచి వ్యవహరించాలని సూచించింది.
వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశంలో సముద్ర ప్రాంతాల వర్షపాత లోటు సుమారు 14 శాతానికి చేరడం, కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉండటం ఆందోళనకరమని నివేదిక పేర్కొంది. దీనివల్ల కాఫీ, కోకో, పామాయిల్, సోయాబీన్ వంటి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగి ఆహార ధాన్యాల ద్రవ్యోల్బణం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్బిఐ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం సవాల్గా మారుతుందని.. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వడ్డీ రేట్లను 25 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచే అవకాశం ఉందని పీఎల్ క్యాపిటల్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ కో-హెడ్ అమ్రిష్ అగర్వాల్ తెలిపారు.
వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం, ముడిసరుకుల ధరల పెరుగుదల, మార్జిన్లపై ఒత్తిడి వంటి అంశాల కారణంగా భవిష్యత్తులో మార్కెట్ అంచనాలు రెండుగా చీలే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మంగళవారం సెషన్లో స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలను చవి చూశాయి. బిఎస్ఇ సెన్సెక్స్12.72 పాయింట్లు తగ్గి 76,944.28 వద్ద నమోదు కాగా.. నిఫ్టీ 24,055 వద్ద ముగిసింది.
మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగొచ్చు
- Advertisement -
- Advertisement -



