న్యూఢిల్లీ : దేశంలో డిజిటల్ చెల్లింపులు నూతన రికార్డ్ స్థాయిని చేరాయి. ఆగస్టు నెలలో మొత్తం 2,451 కోట్ల లావాదేవీల ద్వారా రూ.29.82 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తాజా గణాంకాలు వెల్లడించాయి. జులైతో పోలిస్తే ఆగస్టులో యూపీఐ లావాదేవీల సంఖ్య 3.6 శాతం పెరిగింది. అయితే లావాదేవీల మొత్తం విలువలో స్వల్పంగా 0.2 శాతం తగ్గుదల నమోదయ్యింది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే లావాదేవీల పరిమాణం 22 శాతం, విలువ 20 శాతం పెరిగాయి. ఆగస్టులో ఐఎంపీఎస్ ద్వారా 36 కోట్ల లావాదేవీల్లో రూ.7.04 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి. ఫాస్ట్ట్యాగ్ ద్వారా 35.1 కోట్ల లావాదేవీల్లో రూ.7,185 కోట్ల చెల్లింపులు నమోదయ్యాయి. ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ఏఈపీఎస్లో 10.4 కోట్ల లావాదేవీల ద్వారా రూ.26,035 కోట్ల విలువైన చెల్లింపులు జరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల చెల్లింపుల వరకు యూపీఐ వినియోగం విస్తరిస్తుండటంతో డిజిటల్ చెల్లింపులు భారతీయుల నిత్యజీవితంలో అంతర్భాగంగా మారాయని ఫిన్టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.



