ఐదుగురి సభ్యుల ధర్మాసనం స్టే
ఆస్తుల బదిలీపై ఆంక్షలు
న్యూఢిల్లీ : జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంచ్ ఆయనకు షాక్ ఇచ్చింది. రూ.22,006.57 కోట్ల అప్పులకు గాను రూ.6.25 కోట్ల చెల్లింపు పరిష్కారం ప్లాన్ను ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం నిలిపివేసింది. ఈ కేసును తాజాగా విచారించనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసింది. ఈ చెల్లింపు ప్రణాళికను తొలుత జ్యుడీషియల్ మెంబర్ అశోక్ కుమార్ భరద్వాజ్, టెక్నికల్ మెంబర్ రీనా సిన్హా పురిలతో కూడిన ఎన్సీఎల్టీ బెంచ్ విచారించింది. అయితే ఇద్దరు సభ్యులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రణాళికకు మద్దతు తెలిపిన రుణదాతలకు మాత్రమే దీనిని వర్తింపజేయాలని, వ్యతిరేకించిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ బకాయిల వసూలుకు వేర్వేరుగా చర్యలు తీసుకోవచ్చని భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. పరిష్కార విధాన ప్రక్రియలో తీవ్రమైన లోపాలున్నాయని పేర్కొంటూ పురి ఇంతక్రితం ప్రణాళికను తిరస్కరించారు. ఇద్దరు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 419(5) ప్రకారం తాజా విచారణలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం గత ఉత్తర్వుల్లో స్పష్టమైన మెజారిటీ అభిప్రాయం లేదని పేర్కొంటూ ఆగస్టు 25 నాటి నిర్ణయాన్ని నిలిపివేసింది. కేసు విచారణ కొనసాగుతున్నంత కాలం సుభాష్ చంద్ర ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఆస్తులను బదిలీ చేయకుండా ఆంక్షలు విధించింది. దీంతో ఈ కేసు మరోసారి విచారణకు రానుంది.
జీ సుభాష్ చంద్ర ప్లాన్కు ఎన్సీఎల్టీ బ్రేక్
- Advertisement -
- Advertisement -



